లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో 42 స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రాష్ట్రంలో ఒంటరిగానే టీఎంసీ పోటీ చేస్తుందని మమతా బెనర్జీ వెల్లడించారు. దీంతో ఇండియా కూటమిలో ఏ పార్టీకీ ఒక్క సీటు కూడా ఇవ్వబోవడం లేదని మరోసారి స్పష్టమైంది. కోల్ కతా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన మెగా ర్యాలీలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. “జనగర్జన సభ” సభలోనే మమతా బెనర్జీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బెంగాల్ లో టీఎంసీ తరుపున పోటీచేసే 42 మంది అభ్యర్థులను ఈ సందర్భంగా పరిచయం చేశారు. అసోం, మేఘాలయ లోనూ టీఎంసీ అభ్యర్థులు పోటీ చేస్తారని మమతా బెనర్జీ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లోనూ ఒక స్థానానికి పోటీ చేయనున్నట్లు తెలిపారు.మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ను బహరంపూర్ టీఎంసీ అభ్యర్థిగా ప్రకటించారు. గత లోక్ సభలో పార్లమెంటులో ప్రశ్నలు సంధించేందుకు అక్రమాలకు పాల్పడిన ఆరోపణతో సభ్యత్వం కోల్పోయిన మహువా మొయిత్రా కు తిరిగి టీఎంసీ టికెట్ లభించింది. కిషనగర్ నుంచి ఆమె పోటీ చేస్తారు.