ఆమె సినీ రంగంలో లేడీ సూపర్ స్టార్. ఆ తర్వాత రాజకీయ రంగంలోను రాణించారు. ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. కానీ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. ఫైర్ బ్రాండ్ సైలెంట్ అవడానికి కారణం ఏమిటి…? ఇంతకు ఆ మహిళా పొలిటికల్ స్టార్ ఎవరు…? పొలిటికల్ సర్కిల్స్ లో ఏం చర్చ జరుగుతోంది…?
విజయశాంతి సినిమా రంగంలో కీలక పాత్రలు పోషించారు. అటు తర్వాత రాజకీయ రంగంలోను తనదైన శైలిలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయినప్పటికీ విజయశాంతి ఎందుకు యాక్టివ్ గా లేరు అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత విజయశాంతి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అయినప్పటికీ పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు.
ఇక విజయశాంతి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. తొలుత బీజేపీలో చేరిన విజయశాంతి ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. తన పార్టీని టిఆర్ఎస్ పార్టీలో విలీనం చేశారు. టిఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా ప్రచారం చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం విజయశాంతి పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ విజయశాంతి దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం విజయశాంతిని ఎమ్మెల్సీగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికి విజయశాంతి క్రియాశీలక పాలిటిక్స్ కు మాత్రం దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ట్వీట్స్ చేస్తున్నారు. విజయశాంతి ఎమ్మెల్సీ అయిన తర్వాత ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. పార్టీలోను విజయ శాంతికి ఎలాంటి పదవి దక్కలేదు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నా విజయ శాంతి కాంగ్రెస్ పార్టీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు.
ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్సీగా విజయశాంతి ఉన్నా అటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లోను ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఎమ్మెల్సీ విజయశాంతి పాల్గొన్నారు. ఆ తర్వాత మళ్ళీ రాములమ్మ సైలెంట్ అయ్యారు. ఇకరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మంత్రి పదవి వస్తుందని విజయశాంతి ఆశించారు. కానీ
సామాజిక సమీకరణాల ఆధారంగా అధిష్టానం విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్సీ పదవి దక్కినా విజయ శాంతి యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదనే ప్రచారం నడుస్తోంది. రాబోయే రోజుల్లో అయినా విజయ శాంతి పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత సైలెంట్గా ఉంటున్న
విజయశాంతి తిరిగి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ అవుతారా లేక సైలెంట్ గానే ఉంటారా అనేది చూడాలి.


