ఇండోనేషియాలోని పశ్చిమ సుమత్ర ప్రాంతంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. వరదలతో పాటు చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 70వేల మంది నిరాశ్రయులయ్యారు. 21 మంది ప్రాణాలు కోల్పోగా… ఏడుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.పడాంగ్ సహా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో దాదాపు 200 ఇళ్లు నేల మట్టమయ్యాయి. పలు చోట్ల వంతెనలు, రోడ్లు దెబ్బతిన్నా యి. కొండచరియలు కూలడంతో చాలా మార్గాలు మూసుకుపోయాయి. వరదలతో సుతేరా ఉప జిల్లాలో 200 కుటుం బాలున్న గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. వరద నీరు తగ్గినా… కొండచరియలు పడటంతో సహాయ సహాయచర్యలకు అంతరాయం కలుగుతోంది. దాదాపు 150 మంది సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఆహారం, ఔషధాలు, మంచినీరు సమకూరుస్తున్నారు. ప్రస్తుతం పడాంగ్ ప్రాంతం మొత్తం నీటిలోనే ఉంది. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇండోనేషియాలో వర్షాకాలం జనవరిలో మొదలవుతుంది.