సరిగ్గా 17 నెలల కిందట స్వదేశంలో వరుసగా తొమ్మిది విజయాలు సాధించి వన్డే వరల్డ్ కప్ అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచిన టీమిండియాను ఫైనల్లో ఆస్ట్రేలియా దెబ్బకొట్టింది. అదే ఏడాది వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లోనూ కంగారూ టీమ్ చేతిలో భారత్కి ఎదురుదెబ్బలే. ఇప్పుడు వీటికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీమిండియా సిద్ధమైంది. గత చరిత్ర ప్రతికూలంగా ఉన్నా.. తమ అమ్ములపొదిలోని స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించి నేడు జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్లో కంగారూ టీంను కంగారెత్తించాలని ఫిక్స్ అయింది. ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్ల్లో ఆ టీమ్ చేతిలో వరుస పరాజయాలకు చెక్ పెడుతూ మెగా టోర్నీలో ఫైనల్ చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
మెగా ఈవెంట్లలో మెరుగైన రికార్డు ఉన్న ఆసీస్ ఈసారి కమిన్స్, హేజిల్వుడ్, స్టార్క్, స్టోయినిస్ లాంటి సూపర్ స్టార్లు లేకుండానే టోర్నీలో సెమీస్ చేరుకుంది. తమ తొలిపోరులోనే ఇంగ్లండ్ ఇచ్చిన 352 రన్స్ టార్గెట్ను ఛేజ్ చేసి ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించింది. అయితే, గత రెండు మ్యాచ్ల్లో ఒకటి వర్షంతో రద్దవగా.. మరోదాంట్లో ఫలితం తేలలేదు. దాంతో సరైన ప్రాక్టీస్ లేకుండానే సెమీస్లో బరిలోకి దిగుతోంది. ఇంకోవైపు ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఇండియా ఫుల్ జోష్లో ఉంది. అదే జోరును ఆసీస్పైనా కొనసాగిస్తే రోహిత్సేనను ఫైనల్లో చూడొచ్చు.
చివరగా 2011 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్లో కంగారూ టీమ్ గెలిచింది. 14 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ నాకౌట్ స్టేజ్లో ఆ టీమ్ను ఓడించేందుకు ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఇందుకు ప్రధాన కారణం స్పిన్నర్లే. ఈ టోర్నీకి ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై విమర్శలు వచ్చినా నెమ్మదైన దుబాయ్ పిచ్లపై ఇది మాస్టర్స్ట్రోక్గా మారింది. అలాగే, తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతూ ఇక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఏర్పరుచుకోవడం ఇండియాకు ప్లస్ పాయింట్ అయింది. దాంతో పాటు పిచ్లకు అనుగుణంగా ఆటగాళ్లు తమ నైపుణ్యాన్ని మార్చుకోవడం వల్లే విజయాలు వస్తున్నాయి. ఇక్కడి స్లో వికెట్లపై పెద్దగా టర్న్ లభించకపోవడంతో ఇండియా స్పిన్నర్లు ఓపికతో బౌలింగ్ చేస్తూ ఫలితం రాబడుతున్నారు.
స్పిన్ త్రయం కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్కు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తోడవ్వడంతో ఇండియా బౌలింగ్ మరింత బలోపేతం అయింది. ఈ నలుగురూ ఆదివారం న్యూజిలాండ్పై తొమ్మిది వికెట్లు పడగొట్టి… కివీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరయ్యేలా చేశారు. కివీస్పై ఆడిన తుది జట్టునే కొనసాగిస్తూ కంగారూలపైనా నలుగురు స్పిన్నర్లతో ఇండియా దాడి చేయాలని చూస్తోంది. మన స్పిన్నర్లు ఇదే జోరును కొనసాగిస్తే ఆసీస్ బ్యాటర్లను అడ్డుకోవచ్చు. అయితే, కివీస్తో మ్యాచ్లో మూకుమ్మడిగా నిరాశపరిచిన టాప్3 బ్యాట్స్మెన్ రోహిత్, గిల్, కోహ్లీ కంగారూలపై సత్తా చాటాల్సిన అవసరం ఉంది. శ్రేయస్తో పాటు ఆల్రౌండర్లు అక్షర్, హార్దిక్ ఫామ్లో ఉండటం సానుకూలాంశం. కేఎల్ రాహుల్ కూడా బ్యాట్ ఝుళిపించి.. పేసర్ షమీ సైతం మెప్పిస్తే జట్టుకు తిరుగుండదు.