పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా – ఇరాన్ మధ్య మరోసారి చర్చలకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇస్లామాబాద్ వేదికగా ఇరుదేశాల ప్రతినిధులు వచ్చే వారం సమావేశం కానున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ మళ్లీ చర్చలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇరుదేశాల ప్రతినిధులు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ ( Islamabad)లో సమావేశం కానున్నారని సమాచారం.
ఈ చర్చల్లో సుమారు 14 పాయింట్ల అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. ఇందులో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, యురేనియం నిల్వల బదిలీ, అలాగే హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గించడం వంటి కీలక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఇరాన్ ఇప్పటికే తమపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈ అంశమే చర్చల్లో ప్రధాన అడ్డంకిగా మారినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే చర్చలు సానుకూలంగా సాగితే ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని సమాచారం.
ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్( Donald Trump) స్పందించారు. ఇరాన్ నుంచి ప్రతిపాదనలపై త్వరలోనే స్పందన వచ్చే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరాన్ చర్చలను ఆలస్యం చేస్తుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, “త్వరలోనే వాస్తవం తెలుస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి చేపట్టిన “ప్రాజెక్ట్ ఫ్రీడమ్”ను తిరిగి ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఒప్పందం కుదరకపోతే దీనిని “ప్రాజెక్ట్ ఫ్రీడమ్ ప్లస్”గా విస్తరించే అవకాశం ఉందని కూడా హెచ్చరించారు.
ఇరాన్ హెచ్చరికలు
మరోవైపు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి గుటెరస్( António Guterres)కు ఇరాన్ ప్రతినిధి అమీర్ సయీద్ ఇరవానీ లేఖ రాశారు. అందులో అమెరికా హర్మూజ్ జలసంధిలో సైనిక చర్యలకు పాల్పడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. పర్షియన్ గల్ఫ్ , హర్మూజ్ ప్రాంతాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది.


