పశ్చిమ బెంగాల్ లో బీజేపీ సర్కార్ కొలువుదీరింది. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. కోల్ కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఏపీ సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 207 సీట్లతో అఖండ విజయం సాధించింది బీజేపీ.
సువేందు అధికారి ఎవరు?
అవివాహితుడైన 55 ఏళ్ల సువెందు అధికారి( Suvendu Adhikari) పశ్చిమ బెంగాల్కు 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పదవిని చేపట్టిన తొలి బీజేపీ నేతగా ఆయన అరుదైన చరిత్ర సృష్టించారు.
సువేందు అధికారి 1970 డిసెంబర్ 15న పశ్చిమ బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలో జన్మించారు. రాజకీయ జీవితం ప్రారంభంలో ఆయన 1998లో మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరి, ఆమెకు అత్యంత విశ్వసనీయ నాయకుల్లో ఒకరిగా ఎదిగారు.
2004లో తమలుక్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన… 2006లో కాంథీ దక్షిణ్ నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించారు. అనంతరం రెండు సార్లు ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు.
మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేసిన సువేందు, తరువాత రాజకీయ విభేదాల కారణంగా ఆమెకు దూరమయ్యారు. ముఖ్యంగా మమత కుటుంబ సభ్యులతో వచ్చిన తగాదాల నేపథ్యంలో 2020లో తృణమూల్ కాంగ్రెస్ను వీడి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.
బీజేపీలో చేరిన తర్వాత రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి ప్రధాన వ్యూహకర్తగా నిలిచారు.
అలాగే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్లో, తాజాగా జరిగిన ఎన్నికల్లో భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించి రాజకీయంగా సంచలనం సృష్టించారు.


