హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కీలక పరిణామాలకు రంగం సిద్ధమైంది. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Narendra Modi) హైదరాబాద్కు రానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక వినతులు సమర్పించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy) ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను 8 కొత్త కారిడార్లకు విస్తరించేందుకు కేంద్ర ఆమోదం కోరనుంది.
ఇప్పటికే మెట్రో విస్తరణకు సంబంధించిన డీపీఆర్లు కేంద్రానికి పంపి దాదాపు 7 నెలలు గడిచినప్పటికీ ఇంకా అనుమతులు లభించలేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. దీంతో వేగవంతమైన ఆమోదాల కోసం ప్రధాని జోక్యం కోరే అవకాశం ఉంది. అలాగే మెట్రో ప్రాజెక్టును 50:50 జాయింట్ వెంచర్ విధానంలో చేపట్టాలని కూడా ప్రతిపాదించనున్నారు.
ఇదే సమావేశంలో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు కేంద్ర నిధులు కోరే అంశం కూడా చర్చకు రానుంది. అలాగే హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా అభివృద్ధి చేయడానికి కేంద్ర సహకారం అవసరమని సీఎం ప్రధానికి వివరించనున్నారు.
మొత్తంగా హైదరాబాద్ అభివృద్ధి ప్రాజెక్టులపై కేంద్రం స్పందన ఎలా ఉంటుందన్నదానిపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రేపటి ప్రధాని పర్యటనతో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.


