విశాఖపట్నంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి మరో కొత్త ఆకర్షణతో మెరిసిపోతోంది. ఢమరుకం కలిగిన త్రిశూలం ప్రాజెక్ట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ను రాష్ట్ర మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, విశాఖ ఎంపీ శ్రీభరత్లు కలిసి ప్రారంభించారు.
విశాఖలోని ప్రముఖ హిల్ టూరిస్ట్ స్పాట్ కైలాసగిరి పై ఏర్పాటు చేసిన ఢమరుకం కలిగిన త్రిశూలం ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ (Pranav Gopal), ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ వీఎంఆర్డీఏ ఆధ్వర్యంలో రూపొందించబడింది.
సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూలం ప్రాజెక్ట్ను అభివృద్ధి చేశారు. 65 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ నిర్మాణం విశాఖ నగరంలో ఎక్కడి నుంచి చూసినా కైలాసగిరి వైపు స్పష్టంగా కనిపించేలా రూపొందించారు.
రాత్రి సమయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేందుకు 100 వాట్స్ సామర్థ్యంతో 90 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేశారు. ఢమరుకం కలిగిన త్రిశూలం రాత్రిపూట వెలుగుల్లో ప్రత్యేకంగా దర్శనమిస్తుందని అధికారులు తెలిపారు.
వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ను చేపట్టారు. కేవలం 8 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు, పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కైలాసగిరి ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు.


