స్వతంత్ర వెబ్ డెస్క్: అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించడం.. నేడో, రేపో అభ్యర్థుల తొలి జాబితా విడుదలవుతుందన్న ప్రచారంతో టికెట్ల పోరు రాజుకుంటోంది. చాలా నియోజకవర్గాల్లో ‘సిట్టింగ్’ల స్థానంలో ఎమ్మెల్సీల పేర్లు వినిపిస్తుండడంతో ఎమ్మెల్యేల అనుచరులు నిరసన ప్రదర్శనలకు దిగుతున్నారు. ఒక దశలో పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం చేసే పరిస్థితి ఏర్పడింది.
నిన్న, మొన్నటి వరకు జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాలకే పరిమితమైన నిరసనల పర్వం ఆదివారం భూపాలపల్లికి పాకింది. భూపాలపల్లి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారికి ఇవ్వాలని చారి వర్గీయులు టవరెక్కారు. ఇదే సమయంలో పలుచోట్ల ‘ఎమ్మెల్సీలు వద్దు, ‘సిట్టింగ్’లే ముద్దు అని కొందరు.. సిట్టింగ్లు వద్దు.. ఎమ్మెల్సీలే ముద్దు అని మరి కొందరి పోటాపోటీ ఆందోళనలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.