లోక్సభ ఎన్నికల వేళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది ? అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేడా కొట్టడంతో ఆయా ఎంపీ స్థానాలకు.. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన నేతలను దింపుతారా.. లేదంటే ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా ? ప్రత్యేకించి జహీరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయబోయేది ఎవరు అన్న దానిపై ఇప్పుడు కారు పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారాయి. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు, ఎన్నికల బరిలో ఈసారైనా దిగాలని ఆయా నేతల వారసులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. గులాబీ బాస్ దృష్టిలో మంచి మార్కులు తెచ్చుకొని ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అందరికీ హాట్ సీట్గా కన్పిస్తోంది జహీరాబాద్ ఎంపీ స్థానం.
నిజానికి కామారెడ్డి జిల్లాలోని బీఆర్ఎస్లో చోటుచేసుకున్న అంతర్గత కుమ్ములాటల ఫలితంగా అక్కడ్నుంచి పోటీ చేసిన పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ఓటమి పాలయ్యారు. దీనిపై అప్పట్లోనే పార్టీలో పెద్ద చర్చ జరిగింది. ఎన్నికల ముందే కలహాల గురించి సమాచారం ఉన్నా పార్టీ పెద్దలు అంతగా దృష్టి సారించకపోవడం వల్లే స్వయంగా గులాబీ బాస్ ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నది బీఆర్ఎస్ నేతల విశ్లేషణ. అయితే… లోక్సభ ఎన్నికల్లో ఈసారి మాత్రం ఆ పరిస్థితి రిపీట్ కానివ్వద్దని భావిస్తోంది అధిష్టానం. ఇందులో భాగంగా జహీరాబాద్ ఎంపీ సీటుకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉండడంతో సుదీర్ఘంగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ పై వ్యతిరేకత ఉందన్న ప్రచారం స్థానికంగా సాగుతోంది. అదే సమయంలో ఆయనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీటు ఇస్తారా లేదా అన్నదానిపై ఇంకా ఓ క్లారిటీ కూడా రాలేదు. కానీ, ఆ స్థానంపై అప్పుడే పలువురు నేతలు సీరియస్గా దృష్టి సారించారు. కేసీఆర్ కోసం కామారెడ్డి సీటు త్యాగం చేసిన గంప గోవర్థన్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో అధినేతకు దగ్గరగా ఉండే సుభాష్ రెడ్డి పేరు సైతం ప్రచారంలోకి వస్తోంది. ఇక, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తనయుడు భాస్కర్ రెడ్డి అయితే.. మరో అడుగు ముందుకేసి తన మనసులో మాటను బైట పెట్టేశారు. అవకాశం ఇస్తే ఎంపీగా పోటీలో ఉంటానని వెల్లడించారు. వీరందరి సంగతి ఎలా ఉన్నా.. గులాబీ బాస్ మనసులో అసలు ఏముంది ? ఎవరికి జహీరాబాద్ స్థానం కేటాయిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది.