ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో.. నిన్న మొన్నటి వరకు పార్టీ కేడర్ను అంతగా పట్టించుకోని ఏపీ సీఎం జగన్కు అకస్మాత్తుగా వారంతా గుర్తుకు వచ్చారు. దీంతో రూట్ మార్చిన ఆయన.. పార్టీ ముఖ్యనేతలు, మండల స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. అమరావతి వేదికగా 175 నియోజకవర్గాలకు చెందిన రాష్ట్ర, మండల స్థాయి నేతలతో విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికలకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్.
ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. మరో 10 రోజుల్లో షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన కూటమి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాయి. వైసీపీ ఇప్పటికి ఏడు జాబితాలు విడుదల చేయగా.. టీడీపీ జనసేన కూటమి 99 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. దీంతో.. రానున్న ఎన్నికలు అధికార, విపక్షాల కూటమి మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగనున్నాయి.
అన్ని పార్టీలకూ ఎంతో కీలకంగా మారిన ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి పార్టీలు. ఇందులో భాగంగా పార్టీ మండల స్థాయి, రాష్ట్రస్థాయి నేతలతో సమావేశం కానున్నారు ఏపీ సీఎం జగన్. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ద్వితీయ శ్రేణి నేతల్ని వైసీపీ అధినేత పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. దీంతో.. ఈ విషయంపై అసంతృప్తిగా ఉన్నారు నాయకులు. ఇదే విషయాన్ని హైలెట్ చేస్తూ కొందరు పార్టీ సైతం మారిపోయారు. టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికలు ఇక ఎంతో కాలం లేకపోవడంతో అలర్టయిన ముఖ్యమంత్రి జగన్.. ఇప్పుడు వారితో సమావేశం కాబోతున్నారు.
ఈనెల 27న మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జ్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతోపాటు నియోజకవర్గ స్థాయి అబ్జర్వర్లు, మండల స్థాయి నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా మారిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన, అనుసరించాల్సిన వ్యూహాలపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి మండలం నుంచి పదిమంది వరకు కిందిస్థాయి నాయకుల్ని ఈ సమావేశానికి ప్రత్యేకంగా పిలిపిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. ఈ నాలుగున్నరేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలో చేర్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన అంశాలను క్షేత్రస్థాయిలోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించనున్నారు సీఎం జగన్. ఎన్నికల వేళ వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ నిర్వహించనున్న ఈ సమావేశం పార్టీ గెలుపునకు ఏ మేరకు దోహదం చేస్తుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.