ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపినివ్వకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. గోదావరి నదికి క్రమంగా ఫ్లో పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్కు వరద ఉద్ధృతి పెరిగి.. నీటిమట్టం 7 అడుగులకు చేరింది.దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను అధికారులు ఎత్తివేసి.. 4.3 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
కూనవరం వద్ద నీటిమట్టం 19.20 మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద 11.96 మీటర్లుగా నీటిమట్టం కొనసాగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద.. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.36 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 10 లక్షల క్యూసెక్కులకు వరద చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. 13 లక్షల క్యూసెక్కులకు చేరితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఇవాళ వరద ప్రవాహం 15 లక్షల క్యూసెక్కులు వరకు చేరే అవకాశముంది. ఇక భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. మూడో ప్రమాద హెచ్చరికను దాటి ప్రవాహం కొనసాగుతోంది. 55 అడుగులకు చేరువలో గోదావరి నీటిమట్టం ఉంది. దీంతో అలర్ట్ అయిన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు


