సాధారణ టీ అమ్మే స్థాయి నుంచి దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన మహానేత నరేంద్ర మోదీ. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, తన కృషితో, పట్టుదలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికై ఆయన చరిత్ర సృష్టించారు. ఒక సామాన్య ఆర్ఎస్ఎస్ ప్రచారక్ స్థాయి నుంచి మొదలైన ఆయన ప్రయాణం, గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆపై భారత ప్రధానిగా అప్రతిహతంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 17న 76 ఏళ్లుపూర్తి చేసుకుంటున్న మోదీ దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? ముచ్చటగా మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన ప్రస్థానం ఎలా సాగింది?
భారత రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేసిన నాయకుడు నరేంద్ర మోదీ జీవితం అత్యంత సామాన్యమైన నేపథ్యం నుంచి మొదలైంది. గుజరాత్లోని మెహసానా జిల్లా వాద్నగర్లో 1950 సెప్టెంబర్ 17న దామోదర్దాస్ ముల్చంద్ మోదీ, హీరాబెన్ దంపతులకు ఆయన జన్మించారు. ఆరుగురు సంతానంలో మూడో వాడైన నరేంద్ర మోదీ, చిన్నతనంలోనే కష్టాల కొలిమిలో రాటుదేలారు. వాద్నగర్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద ఆయన తండ్రి నడుపుతున్న చిన్న టీ స్టాల్ కుటుంబానికి ప్రధాన జీవనాధారంగా ఉండేది. బడికి వెళ్లొచ్చిన తర్వాత తన తండ్రికి సహాయంగా మోదీ రైల్వే ప్రయాణికులకు టీలు అందించేవారు. ఆ చిన్న వయసులోనే తరగతి గదికి మించిన విశాల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలనే జిజ్ఞాస ఆయనలో బలంగా నాటుకుంది. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అధిరోహించగలడనడానికి మోదీ బాల్యమే ఒక గొప్ప నిదర్శనం.
స్థానికంగా ఉన్న పాఠశాలలో 1967లో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన మోదీ, ఎనిమిదేళ్ల వయసు నుంచే జాతీయవాద భావాలకు ఆకర్షితులయ్యారు. ఘంచి సామాజిక వర్గ సంప్రదాయాల ప్రకారం పదిహేడేళ్ల వయసులోనే ఆయనకు వివాహం నిశ్చయమైంది. అయితే తన లక్ష్యం వేరని భావించిన యువ నరేంద్ర, పదిహేడేళ్ల వయసులోనే ఇంటిని వదిలిపెట్టి దేశ పర్యటనకు శ్రీకారం చుట్టారు. తన ఆధ్యాత్మిక అన్వేషణలో భాగంగా రాజ్కోట్లోని రామకృష్ణ మిషన్ ఆశ్రమానికి, ఆ తర్వాత కోల్కతా సమీపంలోని బేలూర్ మఠానికి ప్రయాణించారు. అక్కడి నుంచి గువాహటి, హిమాలయాల పర్వత సానువుల్లోని అల్మోరాలో ఉన్న స్వామి వివేకానంద ఆశ్రమానికి వెళ్లి భారతీయ సంస్కృతి, సన్యాస జీవనంపై అవగాహన పెంచుకున్నారు. దేశమంతటా పర్యటించి సమాజపు లోతులను అధ్యయనం చేసిన ఆయన భవిష్యత్ ప్రయాణానికి ఆ యాత్రలే బలమైన పునాది వేశాయి.
దేశాటన పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి వచ్చిన మోదీ, కొంతకాలం తన మేనమామ నడుపుతున్న టీ స్టాల్లో పనిచేశారు. అక్కడే ఆయన జీవితాన్ని మలుపుతిప్పే సంఘటన జరిగింది. గుజరాత్లో ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లక్ష్మణ్రావ్ ఇనాందార్ అలియాస్ వకీల్ సాహెబ్తో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో 1972లో ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరిపోయారు. తన జీవితాన్ని దేశం కోసమే అంకితం చేయాలని ఆయన ఒక దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు, ఆర్ఎస్ఎస్ గుజరాత్ లోక్ సంఘర్ష్ సమితి జనరల్ సెక్రటరీగా మోదీని నియమించింది. పోలీసుల కళ్లుగప్పి అండర్గ్రౌండ్లోకి వెళ్లిన ఆయన, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు.
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన తీరు, సంస్థాగత వ్యవహారాల్లో ఆయన చూపిన చొరవ ఆర్ఎస్ఎస్ పెద్దలను విశేషంగా ఆకర్షించాయి. దీంతో 1978లో ఆయనకు సంఘ్లో మరింత బాధ్యతలు పెరిగాయి. ‘విభాగ ప్రచారక్’గా పదోన్నతి పొందిన మోదీని వడోదర కేంద్రంగా పనిచేయాలని అధిష్టానం ఆదేశించింది. అనంతరం 1979లో ఆయన ఢిల్లీకి వెళ్లి, ఎమర్జెన్సీ చరిత్రపై ఆర్ఎస్ఎస్ వెర్షన్ను రూపొందించే బృందంలో పనిచేశారు. ఆ తర్వాత 1980లో గుజరాత్ రాష్ట్రానికి ‘సంభాగ్ ప్రచారక్’గా ఎదిగారు. దక్షిణ గుజరాత్, సూరత్ ప్రాంతాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన సంస్థాగత నైపుణ్యాలను గుర్తించిన ఆర్ఎస్ఎస్, 1985లో ఆయనను భారతీయ జనతా పార్టీలోకి పంపించింది. ఒక సామాన్య ప్రచారక్ నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టడానికి ఇదే కీలకమైన మలుపుగా నిలిచింది.


