స్వతంత్ర వెబ్ డెస్క్: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ముర్ము మాట్లాడుతూ.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశభక్తి అసమానమైనవని కీర్తించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పోరాటం తరహాలోనే అల్లూరి పోరాటం కూడా ప్రజల్లో ఎంతో స్ఫూర్తి రగిల్చిందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో బ్రిటీష్ వారిని ఎదుర్కొన్నారని ముర్ము వివరించారు. అల్లూరి వంటి మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలని పిలుపునిచ్చారు.
కాగా, ఏపీలో భీమవరం వద్ద నిర్మించిన అల్లూరి స్మృతి వనాన్ని గచ్చిబౌలి సభ నుంచి రాష్ట్రపతి ముర్ము వర్చువల్ గా ప్రారంభించారు. 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు కొత్త తరానికి ఆయన పోరాట స్ఫూర్తిని తెలియజేశాయని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘బ్రిటీష్ బంధనాల నుంచి భారత మాత విముక్తి కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి. అల్లూరి గొప్పతనాన్ని.. చరిత్రను ముందు తరాలకు తీసుకెళ్లాలి. అల్లూరి సీతారామరాజు దైవాంశ సంభూతుడని భావిస్తా. మహా కవి శ్రీశ్రీ అల్లూరి గురించి రాసిన ‘తెల్లవారి గుండెల్లో నిదురించిన వాడా.. మాలో నిదురించిన పౌరుషాగ్ని రగిలించిన వాడా’ సినిమా పాట చాలా పాపులర్ అయింది. ఆ పాటను నేను చాలా ఇష్టంగా వినేవాడిని. 26 సంవత్సరాల పిన్న వయసులోనే రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు. భరతజాతి చెప్పుకొనే ఎంతో మంది అమరవీరుల సరసన మేము తక్కువ కాదు అని మన తెలగుజాతిని నిలబెట్టిన గొప్ప మహనీయుడు అల్లూరి’’ అని సీఎం కేసీఆర్ కొనియాడారు.