కన్నడ స్టార్ యష్ నటిస్తున్న తాజా చిత్రం టాక్సిక్.. మార్చి 19న విడుదల కావాల్సి ఉండగా.. వాయిదా పడింది. కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలోని కొంత భాగంతో యష్ సంతృప్తిగా లేరని.. వాటిని రీ షూట్ చేసేందుకు వంద రోజుల ప్రణాళిక రూపొందించినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి నిర్మాతకు దాదాపు రూ. 40 కోట్లు ఖర్చవుతుందని కొందరు అంచనా కూడా వేశారు. ఇప్పుడు, కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ఎలాంటి రీషూట్లు ప్లాన్ చేయలేదని స్పష్టం చేశారు. దీంతో, నిర్మాణ బృందం ఈ వదంతులకు తెరదించింది.
మార్చి నుంచి తరచూ విడుదల తేదీలు మారుతుండటమే ‘టాక్సిక్’ రీషూట్ల గురించి ఊహాగానాలకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిసెంబర్ 2025లో, చిత్రనిర్మాతలు యష్ నటించిన సినిమా విడుదల తేదీని మార్చి 19గా ప్రకటించారు. బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ ధురందర్ 2తో పోటీ పడటానికి సిద్ధమైంది.
కానీ ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా సినిమా విడుదలను జూన్ 4కు వాయిదా వేసినట్లు మార్చి 4న కేవీఎన్ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రాచ్య షట్డౌన్ కారణంగా ఆ సినిమా అక్కడ విడుదల కాలేకపోయింది, ఫలితంగా నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లింది. అయితే, ‘టాక్సిక్’ నిర్మాతల ఈ నిర్ణయం వల్ల ‘ధురందర్ 2’ మార్చి 19న సోలోగా విడుదలైంది, మొదటి భాగం లాగే ఈ ఆదిత్య ధర్ చిత్రం కూడా భారీ బ్లాక్బస్టర్గా నిలిచింది.


