LRSపై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తున్నారు. HMDA ఆఫీస్ దగ్గర బీఆర్ఎస్ నేతల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. LRSపై కాంగ్రెస్ సర్కార్ మాట మార్చిందని తలసాని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షంలో ఉన్నప్పుడు LRS ఉచితంగా ఇస్తామమని… అధికా రంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని మండిపడ్డారు. LRSను ఉచితంగా అమలు చేసే వరకు పోరాటం చేస్తామని తలసాని తెలిపారు.
LRS రుసుమును రద్దు చేయాలని నిర్మల్ జిల్లాలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆద్వర్యంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ నిరసన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. LRS రుసుమును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు LRS రుసుమును తీసుకోవద్దని బీఆర్ఎస్ను డిమాండ్ చేసిందని గండ్రత్ ఈశ్వర్ అన్నారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక LRS రుసుమును విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం LRSపై తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని… లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మోస పూర్విత హామీలు ఇచ్చి… గెలిచాక మాట మార్చడం సరికాదని బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లా ఆల్వాల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేపట్టారు. పేద మధ్యతరగతి కుటుంబాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం LRS క్రమబద్దీకరణ పేరుతో 20వేల కోట్లు వసూలు చేయడానికి సిద్ధపడిందని మర్రి రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉచితంగా ఎల్ఆర్ఎస్తోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ… ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు… ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడి చేస్తున్నారో చెప్పాలని అన్నారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని హెచ్చరించారు.