తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పొలిటికల్ వార్ మరింత ముదురుతోంది. రాష్ట్ర గీతం, లోగో మార్పులపై మాటల తూటాలు పేలుతున్నాయి. దీంతో రాష్ట్ర రాజకీయం రంజుగా సాగుతోంది.
జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ముస్తాబవుతున్న వేళ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ వైరం ముదురుతోంది. రాష్ట్ర గీత రూపకల్పనలో సంగీత దర్శకుడు కీరవాణికి అప్పజెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ప్రాంతీయ బేధాన్ని ఎత్తి చూపుతూ విమర్శిస్తోంది. అలాగే రాష్ట్ర రాజముద్రలో మార్పులపై కూడా గులాబీ నేతలు గుర్రుగా ఉన్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ను తొలగించడంపై ఫైర్ అవుతున్నారు. చారిత్రక ప్రత్యేకత, ప్రజలు మెచ్చేలా పరిపాలన సాగించిన కాకతీయుల స్ఫూర్తిని కొనసాగించేలా ఉండేందుకు వీలుగా కేసీఆర్ రాజముద్రలో కళాతోరణానికి స్థానం కల్పించారని కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. తెలంగాణ సంస్కృతికి తూట్లు పొడిచేలా, ఆత్మగౌరవం దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన గులాబీ నేతలు.. ఇవాళ చార్మినార్ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.
ఇక మరోవైపు బీఆర్ఎస్ నేతలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు హస్తం లీడర్లు. ఎందరో ప్రాణ త్యాగాలతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని.. అలాంటి అమరుల ఆనవాళ్లు మచ్చుకైనా రాజముద్రలో లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. రాజ్యం తెచ్చిన నిజమైన రాజులు అమరవీరులేనని.. వారి ఉనికిని ప్రశ్నార్థకం చేసి, రాజ్యం ఏలే రాజులు.. మేమే తెలంగాణకు సర్వం.. సర్వస్వం అంటే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. అమరుల ఆనవాళ్ళకు పట్టం కడుతూ తెలంగాణ రాజముద్రను వారి ఆశయాలకు అనుగుణంగా మార్చబోతున్నామని చెబుతున్నారు.


