స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. ఆదివారం రాత్రి గుర్తు తెలియని ఓ భక్తుడు ఆనంద నిలయం వరకూ మొబైల్ ఫోన్ తీసుకెళ్లాడు. అంతేకాకుండా గర్భగుడిని బయటి నుంచి వీడియోలో చిత్రీకరించాడు. అలిపిరి నుంచి కంపార్టమెంట్స్ లోకి వెళ్లే వరకు చాలా చోట్ల విజిలెన్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టి మొబైల్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు. అలాంటిది ఆ వ్యక్తి ఏకంగా గర్భగుడిలోకే ఫోన్ తీసుకెళ్లడం చూస్తుంటే సిబ్బంది వైఫల్యం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
విమాన వెంకటేశ్వరుడికి భక్తులు మొక్కే దృశ్యాలతో పాటు గర్భగుడి కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టీటీడీ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. ఓ భక్తుడు సెల్ ఫోన్ తో గర్భగుడి దాకా వెళ్తుంటే భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు. దీంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా సదరు భక్తుడిని గుర్తించే పనిలో పడ్డారు.