స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖపట్నంలో జరిగిన వైసీపీ ఎంపీ కుటుంబం కిడ్నప్ కేసు గురించి పూర్తి వివరాలను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. డబ్బు కోసం మాత్రమే ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసారని డీజీపీ తెలిపారు. కిడ్నాప్ వ్యవహారంలో నిందితులు రూ.1.75 కోట్ల నగదు వసూలు చేశారని.. వాటిలో ఇప్పటివరకు రూ.86.5 లక్షలు రికవరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులు ఎంపీ కుమారుడి ఇంట్లోకి వెళ్లి బెదిరించి.. ఎంపీ కుమారుడు శరత్ను ఇంట్లో కట్టేసారు. మరుసటి రోజున ఎంపీ భార్య జ్యోతిని కుమారుడు శరత్తో పిలిపించి ఆమెను కూడా అదే ఇంట్లోనే బంధించారు. ఆడిటర్ జీవీ వస్తే ఆయన్ను కూడా కట్టేసి బెదిరించారు. ఎంపీ కుమారుడి ఇంట్లో ఉన్న రూ.15లక్షలు తీసుకున్నారు. మరో రూ.60 లక్షలు ఖాతా నుంచి బదిలీ చేయించుకున్నారు. జీవీని కొట్టి బెదిరించి రూ.కోటి వరకు తెప్పించుకున్నారు’’ అని డీజీపీ వివరించారు.
కిడ్నాప్ సమాచారం అందగానే పోలీసులు గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. కిడ్నాపర్లు రుషికొండ ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందిందని చెప్పారు. అప్పటివరకు బాధితులను కిడ్నాపర్లు డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చారన్నారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు తెలిసి ఎంపీ సతీమణి, కుమారుడు, అడిటర్ జీవీతో పాటు కారులో పరారయ్యేందుకు యత్నించారు. నిందితులు హేమంత్, రాజేశ్, సాయి ముగ్గురూ కలిసి కారులో తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. పోలీసులు ఛేజ్ చేశారు. పద్మనాభం ప్రాంతంలో కిడ్నాపర్ల కారు మరమ్మతుకు గురవ్వడంతో కిడ్నాప్ చేసిన ముగ్గుర్నీ అక్కడే వదిలేసి పరారయ్యారని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలోని శాంతిభద్రతలు సరిగా లేవని వస్తోన్న వార్తలపైనా డీజీపీ స్పందించారు. ఈ నేరఘటనను శాంతిభద్రతలకు ముడిపెట్టడం సరికాదన్నారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లలో నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ వివరించారు.