అమెరికా లూసియానాలో విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు స్నేహితుల ప్రాణాలు కాపాడిన నల్గొండ జిల్లాకు చెందిన తెలుగు యువకుడు మృతి చెందాడు. టోరోడో పార్క్లో ఉన్న సెబాన్ రివర్లో సరదాగా స్నేహితులతో ఈతకొట్టేందుకు కోడూరు అనురూప్ రెడ్డి వెళ్లారు. ఈత కొట్టే సమయంలో అనూప్తో పాటు మరో ముగ్గురు స్నేహితులు కూడా ఉన్నారు. ముగ్గురు స్నేహితుల్లో ఒక్కొక్కరు లోతు ప్రదేశంలోకి వెళ్తూ రక్షించండి అంటూ ఆహాకారాలు చేశారు. అనురూప్ రెడ్డి ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని పైకి లాగుతూ ఓడ్డుకు చేర్చారు.. అనురూపు రెడ్డి పైకి వచ్చే క్రమంలో అనూహ్యంగా చెరువులో ఉన్న ఫిషింగ్ వైర్ కాలికి చుట్టుకుంది. పైకి రావడం ఇబ్బందికరంగా మారడంతో నీటి ప్రవాహం పెరిగి అందులోనే అనురూపు రెడ్డి మృత్యువాత పడ్డాడు. ఒడ్డుకు చేరుకున్న స్నేహితులు, అక్కడున్న ఈతగాళ్లు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే అనూప్రెడ్డి మృతి చెందాడని వైద్యులు చెప్పారు.
అనూప్రెడ్డి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్న సమయంలో ఇలా స్నేహితులతో సరదాగా గడిపేందుకు వెళ్లి మృత్యువాత పడటాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనూప్ రెడ్డి స్వగ్రామం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం. వీరి కుటుంబం హైదరాబాద్లో రెండు దశాబ్దాల క్రితం వచ్చి స్థిరపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేందర్ రెడ్డి, దుర్గా భవాని చిన్న కుమారుడే అనూప్రెడ్డి. వీరు ప్రస్తుతం హైదరాబాద్ వనస్థలిపురం కావడి గ్రామంలో ఉంటున్నారు. పెద్ద కొడుకు ఆశ్రీత్ రెడ్డి కూడా అమెరికాలోనే ఉన్నారు.


