తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. వారం రోజుల నుంచి కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల దిగువున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలంగాణలో రెండు రోజుల పాటు అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మౌలాలి, HCU ప్రాంతాల్లో అత్యల్పంగా 7.1 డిగ్రీలు.. రాజేంద్రనగర్లో 8.2 డిగ్రీలుగా నమోదైంది. ఇక గచ్చిబౌలిలో 9.3, వెస్ట్ మారేడ్పల్లిలో 9.9, కుత్బుల్లాపూర్లో 10.2, పటాన్చెరులో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బోయిన్ పల్లిలో 11.9, బేగంపేటలో 11 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. నిన్న 11 డిగ్రీల సెల్సియస్ గా రికార్డ్ అయ్యింది. దీని కారణంగా ఆదిలాబాద్, కొమ్రంభీమ్ ఆసిఫాబాద్, మెదక్ జిల్లాల్లో ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు టెంపరేచర్లు 15.02 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని తెలిపింది. ఇటు ఏపీలోనూ చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతున్నారు. వారం రోజుల నుంచి చలి తీవ్రత మరింత పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. విశాఖ, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాలలో కనిష్ట స్థాయి టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.