స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రతికూల వాతావరణం కారణంగా అమర్నాథ్ యాత్ర వరుసగా రెండో రోజూ నిలిచిపోయింది. భారీ వర్షాలతో జమ్ము- శ్రీనగర్ హైవేపై కొండచరియలు విరిగిపడటంతో అమర్ నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పహల్గాం, బల్తాల్ రెండు మార్గాల్లోనూ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా బల్తాల్, నున్వాన్ బేస్ క్యాంపుల్లోనే వేలమంది యాత్రికులు ఉండిపోయారు. అమర్ నాథ్ యాత్రలో తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. పంచతర్ణి ప్రాంతంలో సుమారు 1,500 మంది యాత్రికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో 200 మంది వరకూ తెలుగు యాత్రికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ అమర్నాథ్ మంచు శివలింగాన్ని 80 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ఆగస్టు 31తో అమర్ నాథ్ యాత్ర ముగియనుంది.
రాంబన్ జిల్లాలోని జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం, రహదారి కొట్టుకుపోవడంతో శనివారం ఉదయం జమ్మూ సిటీ నుంచి అమర్నాథ్ తీర్థయాత్ర నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారం ఉదయం భగవతి నగర్లోని యాత్రి నివాస్ బేస్ క్యాంప్ నుంచి యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. భారీ వర్షాలు, కశ్మీర్లో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న వాతావరణ పరిస్థితుల కారణంగా అమర్ నాథ్ యాత్రకు ఇవాళ కొత్త బ్యాచ్ను అనుమతించలేదని ఆయన తెలిపారు.
ఈ తెల్లవారుజామున కురిసిన వర్షాలకు రాంబన్ వద్ద కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ నేపథ్యంలోనే అమర్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. యాత్రికులు జమ్ము నుంచి బయల్దేరకుండా నిలిపివేసినట్లు చెప్పారు. ఇప్పటికే యాత్ర మధ్యలో ఉన్నవారిని బేస్ క్యాంప్ల్లోనే ఉంచినట్లు తెలిపారు.
ప్రతికూల వాతావరణం కారణంగా శుక్రవారం కూడా యాత్రను నిలిపివేశారు. దీంతో యాత్రికులను సమీపంలోని బేస్క్యాంప్లకు తరలించారు. ఈ ఉదయం వారిని యాత్ర కొనసాగించొద్దని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం యాత్రికులంతా షెల్టర్ స్టేషన్లలో సురక్షితంగానే ఉన్నారని అధికారులు వెల్లడించారు. పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు.
62 రోజుల పాటు జరిగే వార్షిక అమర్నాథ్ యాత్రలో దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3,888 మీటర్ల ఎత్తులో ఉండే మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తుతారు. ఈ ఏడాది కూడా జులై 1న అమర్నాథ్ యాత్ర ప్రారంభమవ్వగా.. ఇప్పటివరకు 82వేల మందికి పైగా దర్శించుకున్నారు. ఆగస్టు 31 వరకు యాత్ర కొనసాగనుంది.


