మెగాస్టార్ చిరంజీవితో.. నాగ్ అశ్విన్ పాతాళ భైరవి అనే సినిమా చేయనున్నట్టుగా గతంలో వార్తలు వచ్చాయి. ఈ మూవీని సుప్రసిద్ద నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మించాలి అనుకున్నారు. అయితే.. ఇంత వరుకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చిన నాగ్ అశ్విన్ పాతాళ భైరవి గురించి అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ.. నాగ్ అశ్విన్ ఏం చెప్పారు..?
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి సినిమాతోనే కమర్షియల్ సక్సెస్ సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నాగ్ అశ్విన్. ఆతర్వాత మహానటి అంటూ అలనాటి నటి సావిత్రి జీవిత కథను తెర పై అద్భుతంగా ఆవిష్కరించి.. అద్బుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే.. ఆ సినిమా విజయాన్ని పురుష్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి.. మహానటి టీమ్ ని ఇంటికి పిలిచి మరి అభినందించారు. ఆ టైమ్ లో మంచి కథ ఉంటే చెప్పు సినిమా చేద్దామని మెగాస్టార్ అంటే… నాగ్ అశ్విన్ పాతాళ భైరవి తరహా స్టోరీ లైన్ చెప్పారని.. ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని వార్తలు వచ్చాయి.
చిరు, నాగ్ అశ్విన్ కాంబో మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సుప్రసిద్ద నిర్మాత అశ్వనీదత్ నిర్మించనున్నారని ప్రచారం జరిగింది. ఆతర్వాత ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాలేదు. ఇప్పుడు సింగ్ గీతం ప్రమోషన్స్ భాగంగా మీడియా ముందుకు వచ్చిన నాగ్ అశ్విన్ ని ఈ సినిమా గురించి అడిగితే అసలు విషయం బయటపెట్టారు. ఇంతకీ ఏం చెప్పారంటే.. చిరంజీవి గారితో సినిమా చేయాలి అనుకున్న మాట వాస్తవమే కానీ.. పూర్తి స్థాయిలో కథ లేదని.. ఆతర్వాత తను కల్కి ప్రాజెక్టులో బిజీ అవ్వడం వలన కుదరలేదని చెప్పారు.
అయితే.. తనకు పాతాళ భైరవి సినిమా అంటే చాలా ఇష్టమని.. ఆ జోనర్ లో ఎప్పుడు సినిమా తీసినా బాగుంటుందన్నారు. నాగ్ అశ్విన్ మాటాలను బట్టి చిరంజీవితో సినిమా లేదని క్లారిటీ వచ్చింది. అయితే.. నాగ్ అశ్విన్ పాతాళ భైరవి జోనర్ లో ఫ్యూచర్లో సినిమాని ఖచ్చితంగా చేస్తాడని తెలుస్తుంది. మరి.. నాగ్ అశ్విన్ పాతాళ భైరవి ఎవరితో ఉంటుందో చూడాలి.


