2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత రక్షణ ఎగుమతులు ఆల్టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం… రక్షణ ఎగుమతులు రూ.38,424 కోట్లకు చేరుకుని, గత ఆర్థిక సంవత్సరంలోని రూ.23,622 కోట్లతో పోలిస్తే 62.66 శాతం వృద్ధి నమోదు చేశాయి.
ఒక్క ఏడాదిలోనే రూ.14,802 కోట్ల పెరుగుదల నమోదవడం ఇప్పటివరకు రక్షణ ఎగుమతుల చరిత్రలోనే అతిపెద్ద వార్షిక వృద్ధిగా నిలిచింది. భారతదేశంలో తయారైన సైనిక పరికరాలు, రక్షణ సాంకేతికతలకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు ఇది నిదర్శనంగా భావిస్తున్నారు.
ఇదే సమయంలో దేశీయ రక్షణ ఉత్పత్తి కూడా 2025-26లో రికార్డు స్థాయిలో రూ.1.78 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది భారత స్వదేశీ రక్షణ పరిశ్రమ వేగంగా విస్తరిస్తోందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరింత బలం చేకూరుస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


