బ్రెజిల్లో 21 ఏళ్ల యువతి బంగీ కార్డ్ లేకుండానే వంతెనపై నుంచి విసిరేయడంతో మృతి చెందిన ఘటన మరువకముందే, మరో మహిళ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. 59 ఏళ్ల రోజ్మేరీ సుజార్ట్ గార్సియా అనే మహిళ, బగ్ స్ప్రే రాసుకుంటూ జారి సుమారు 100 అడుగుల లోతులో పడిపోవడంతో మృతి చెందింది. ఈ ఘటన ఆదివారం బ్రెజిల్లోని రియో డి జనీరో సమీపంలోని మారికా ప్రాంతంలో ఉన్న గ్రుటాస్ డో స్పార్ వద్ద జరిగింది.
రోజ్మేరీ తన స్నేహితుల బృందంతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లింది. ఈ సందర్భంగా ఒక వ్యూ పాయింట్ సమీపంలోని చిన్న దారిపై నిలబడి కాళ్లకు స్ప్రే వేయడానికి ఒక కాలును పైకెత్తింది. అప్పుడు ఆమె బాలెన్స్ కోల్పోయి కొండ అంచు నుంచి కింద పడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.


