స్వతంత్ర వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ నేత రెచ్చిపోయాడు. అప్పు తీసుకున్న మహిళ వడ్డీ డబ్బులు ఇంకా చెల్లించాలంటూ నలుగురితో కలిసి జులుం ప్రదర్శించాడు. ‘నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీకు దిక్కున్న చోట చెప్పుకోమని ఆమెపై దాడి చేయించాడు. అయితే, అప్పు తీసుకున్న డబ్బులకు వడ్డీతో సహా చెల్లించానని బాధిత మహిళ చెబుతుండడం గమనార్హం. వైసీపీ నేత మహేంద్ర దగ్గర కరకమిట్ల పార్వతి అనే మహిళ ఏడాది క్రితం రూ.50 వేలు అప్పు తీసుకున్నారు. ఈ మొత్తానికి అసలుతో పాటు రూ.50వేలు వడ్డీ కూడా చెల్లించినట్లు ఆమె చెప్పారు. మహేంద్రకు వడ్డీతో సహా అప్పు మొత్తం తీర్చేశానని తెలిపారు. శనివారం రాత్రి ఇంకా రూ.65 వేలు వడ్డీ డబ్బులు చెల్లించాలంటూ యువకులతో కలిసి వైసీపీ నేత దాడి చేయించాడని పార్వతి ఆరోపించారు. చేసేదేమీ లేక ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్కు వెళ్లగా అక్కడ పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు బాధితురాలు చెప్పారు. వెంటనే పోలీసులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే పార్వతికి చికిత్స కొనసాగుతోంది.