ట్విషా శర్మ(Twisha Sharma) అనే 33 ఏళ్ల మాజీ మిస్ పుణే, ఎంబీఏ పట్టభద్రురాలు ఈ నెల ప్రారంభంలో భోపాల్( Bhopal) లోని తన భర్త ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మార్కెటింగ్ రంగంలో పనిచేసిన ట్విషా, బ్యూటీ పేజెంట్లు, సినిమాల్లో కూడా గుర్తింపు తెచ్చుకుంది.
మే 12న భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న భర్త సమర్థ్ సింగ్ (Samarth Singh) ఇంట్లో ఆమె ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. 2024లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన ఈ జంట 2025 డిసెంబర్లో వివాహం చేసుకుంది.
ట్విషా నోయిడాలో ఎంబీఏ పూర్తి చేసి, ఢిల్లీలో కొన్నేళ్లు పనిచేసింది. 2021లో వచ్చిన తెలుగు చిత్రం ముగ్గురు మొనగాళ్లు( Mugguru Monagallu) లో కూడా నటించింది. మార్కెటింగ్, కమ్యూనికేషన్ రంగాల్లో అనుభవం కలిగిన ఆమె ముంబైలోని ఫ్లేవర్ పాట్ ఫుడ్స్లో మార్కెటింగ్ మేనేజర్గా, తర్వాత జర్మన్ అకాడమీ ఆఫ్ డిజిటల్ ఎడ్యుకేషన్లో కమ్యూనికేషన్ అండ్ ఆన్బోర్డింగ్ మేనేజర్గా పనిచేశారు.
ట్విషా యోగా ట్రైనర్గా, విపశ్యన ధ్యాన సాధకురాలిగా కూడా గుర్తింపు పొందింది.
నన్ను తీసుకెళ్లిపోండి
ఆమె మరణం తర్వాత బయటకు వచ్చిన వాట్సాప్ చాట్స్లో, పెళ్లి జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు వెల్లడైంది. తన తల్లికి పంపిన సందేశాల్లో “నా జీవితం నరకంగా మారింది” అంటూ బాధ వ్యక్తం చేసింది. భోపాల్కు ఎందుకు పంపించారని, భర్త తనతో మాట్లాడటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
మే 7న స్నేహితురాలితో చేసిన చాట్లో కూడా పెళ్లి తర్వాత జీవితంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. “పెళ్లి చేసుకోవడంలో తొందరపడొద్దు” అంటూ స్నేహితురాలికి సూచించింది.
మృతిపై అనుమానాలు
ట్విషా మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. భోపాల్లోని సీఎం నివాసం ఎదుట ఆందోళన చేపట్టి, ఢిల్లీ ఎయిమ్స్లో మళ్లీ పోస్ట్మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. మృతదేహంపై గాయాలు కనిపించాయని, కేసు నమోదు చేయించేందుకు పోలీసులు సహకరించలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ట్విషా భర్త సమర్థ్ సింగ్, అతని తల్లి, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్( Giribala Singh) పై కట్న వేధింపుల ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేశారు.
కుటుంబ సభ్యులు ఇది హత్యేనని ఆరోపిస్తూ న్యాయం కోసం పోరాడుతున్నారు. నిందితులు ముందస్తు బెయిల్ పొందడం వల్ల దర్యాప్తుపై ప్రభావం పడే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


