ఇటీవల ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య జరిగిన విభజన సమస్యల పరిష్కాల భేటీని ఉద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ట్వీట్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి, తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారని అందరూ భావించారన్నారు. కానీ తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలకంటే టీడీపీ ప్రయోజనాలే చంద్రబాబు రహస్య అజెండాగా ఉన్నాయేమో అన్న అనుమానం కలుగుతోందని ఆమె సందేహం వ్యక్తం చేశారు.
తెలంగాణాలో మళ్లీ టీడీపీ విస్తరిస్తుందంటూ చంద్రబాబు చేసిన ప్రకటనే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. తెలంగాణాలో టీడీపీ బలపడుతుందని ఆయన అనడం పలు అనుమానాలకు తావిస్తోందని విజయశాంతి అన్నారు. తెలంగాణాలో టీడీపీ ఎప్పటికీ బలపడదన్నారు. తన కూటమి భాగస్వామి అయిన బీజేపీతో కలిసి బలపడడానికి కుట్రలు చెయ్యడానికి ప్రయత్నిస్తే టీడీపీతో పాటు బీజేపీని కూడా గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. తిరిగి తెలంగాణవాదులు, ఉద్యమకారులు పోరాట ప్రస్థానానికి కదలటం నిశ్చయమైన భవిష్యత్ వాస్తవమని విజయశాంతి ట్వీట్ చేశారు.