స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ శివారు బండ్లగూడలో కారు బీభత్సం సృష్టించింది. మార్నింగ్ వాక్కు వెళ్తున్న నలుగురిని బండ్లగూడ జాగీర్ సన్ సిటీ వద్ద కారు ఢీకొట్టింది. ప్రమాదంలో తల్లీకుమార్తెలు మృతిచెందగా.. మరో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. గాయపడిన మహిళలను ఆస్పత్రికి తరలించారు. మృతులను అనురాధ(38), మమత(26)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మంగళవారం ఉదయం హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై అదుపు తప్పిన కారు.. రోడ్డు పక్కన మార్నింగ్ వాక్ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది. దీంతో మార్నింగ్ వాక్ కు వచ్చిన అనురాధ, మమతలతో పాటు మరో మహిళ అక్కడికక్కడే చనిపోయారు. మరో ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. అక్కడి పరిస్థితి భయానకంగా మారింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోస్ట్మార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.