పార్లమెంటు ఎన్నికలు ముంచుకువస్తున్న వేళ.. ఇండియా కూటమిలో సీట్ల పంపిణీ మొదలైంది. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ 63 సీట్లకు పోటీ చేస్తూ, కాంగ్రెస్ కు రాయ్ బరేలి, అమేథితో సహా 17 స్థానాలను కేటాయించింది. సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నిక కావడంతో రాయ్ బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారు.. అమేథీ నుంచి రాహుల్ గాంధీ మళ్లీ పోటీ చేస్తారా.. కేరళ లోని వయినాడ్ నుంచే పోటీ చేస్తారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. అమేథి లో మళ్లీ రాహుల్, స్మృతి ఇరానీ మధ్య పోటీ ఉంటుందా అన్నది కోటి డాలర్ల ప్రశ్న.
ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ, అమేథి నియోజకవర్గాలు తరతరాలుగా నెహ్రూ- గాంధీ కుటుంబానికి సంప్రదాయం గా వస్తున్న నియోజకవర్గాలు. ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప, దాదాపు అర్థశతాబ్దిగా ఈ కుటుంబానికి చెందినవారే ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ వద్రా ఈసారి రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కానీ, సోనియాగాంధీ కానీ, ప్రియాంక గానీ ఈ విషయాన్ని ధ్రువీకరించలేదు. రాయ్ బరేలీ నుంచి ఈ సారి ఎవరు పోటీ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
కొన్ని దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చిన అమేథీలో మళ్లీ కాంగ్రెస్ జెండా రెపరెపలాడాలని ఆ పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ దాదాపు 15 ఏళ్లుగా అమేథీకి ప్రాతినిధ్యం వహించారు. 2019లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై విజయం సాధించారు. 2019లో రాహుల్ గాంధీ ఇటు అమేథీలోనూ, అటు కేరళలోని వయినాడ్ నుంచి పోటీచేశారు. వయినాడ్ లో విజయం సాధించి లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. ఎట్టిపరిస్థితుల్లో నైనా అమేథీని నిలబెట్టుకోవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. స్మృతి ఇరానీ మళ్లీ బీజేపీ తరుపున అమేథీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో స్మృతికి దీటైన పోటీ ఇచ్చి విజయం సాధించగల కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ తప్ప మరొకరు లేరని.. పార్టీలో ప్రచారం జరుగుతోంది. అందువల్ల 2024లో మళ్లీ అమేథి నుంచి రాహుల్ గాంధీ కచ్చితంగా పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
రెండు మూడు సందర్భాల్లో తప్ప, 1967 నుంచి అమేథీనుంచి నెహ్రూ- గాంధీ కుటుంబమో, ఆ పార్టీ అనుయాయు లో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ప్రస్తుతం అమేథికి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1970వ దశకంలో, 1990 దశకంలోనూ ఇలా రెండు సార్లు ఇతరులు ప్రాతినిధ్యం వహించారు. 1980 లో సంజయ్ గాంధీ అమేథీ నుంచి ఎన్నిక య్యారు. ఆయన ఆకాల మరణంతో 1981లో జరిగిన ఉపఎన్నికలో రాజీవ్ గాంధీ ఎన్నికై 1991 వరకూ ప్రాతినిధ్యం వహించారు. 1999లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ భార్య సోనియాగాంధీ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2019 వరకూ రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. అమేథి కేవలం ఓ నియోజకవర్గం కాదు. అది కాంగ్రెస్ కు కంచుకోట. కంచుకోట వంటి నియోజకవర్గాన్ని నిలుపుకోవాలని ఏ పార్టీ అయినా ఆశిస్తుంది. ప్రస్తుతం రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాయ్ బరేలీ, అమేథిలో జరిపిన పర్యటనలో అపూర్వ ప్రజాదరణ లభించింది. అక్కడి ప్రజలంతా రాహుల్ మళ్లీ పోటీ చేయాలని కోరుతున్నారు. ప్రజల ఉత్సాహాన్ని చూసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రాహుల్ అమేథీనుంచి పోటీ చేయాలని కోరుతున్నారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


