ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని గుర్తించారు. మానవరహిత విమాన గాలింపులో కనుగొన్నట్లు ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ తెలిపింది. తావిల్ అనే ప్రాంతంలో హెలికాప్టర్ కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతానికి సహాయక బృందాలను పంపారు. మరోవైపు టర్కీకి చెందిన అకింజి అనే UAV కాలుతున్నట్లుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించింది. అది హెలికాప్టర్ కూలిన ప్రాంతమేనని అనుమానిస్తున్నారు. ఈ సమాచారాన్ని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కమాండర్ ధ్రువీకరించారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ రైసీ ఆచూకీ గుర్తించడం కోసం ప్రత్యేక దళాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. పొగ మంచు, వర్షం సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. తూర్పు అజర్ బైజాన్ రాష్ట్రంలోని వర్జాకాన్ నగరానికి సమీపంలో ఉన్న అడవుల్లో సైనిక బలగాలు ముమ్మర గాలింపు కొనసాగిస్తున్నాయి. ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నిన్న ఓ అటవీ ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఆయన సురక్షితంగా ఉన్నదీ లేనిదీ అంతుచిక్కకపోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ అధ్యక్షుడి క్షేమ సమాచారం కోసం పలు దేశాలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. హెలికాప్టర్ ప్రమాదంపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్-అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.