తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. ఫలితాల తర్వాత గెలిచిన అభ్యర్థులు ఎవరైనా పార్టీలు ఫిరాయిస్తే.. వాళ్ల ఇంటి ముందు ధర్నాలు చేస్తామని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. ‘‘1978 లో జరిగిన ఎన్నికలకు 2023 లో నిన్న జరిగిన ఎన్నికలకు కొంత పోలిక ఉంది. ఎమర్జెన్సీ తర్వాత ప్రజల తిరుగుబాటు అప్పుడు కనిపించింది. నిన్న జరిగిన ఎన్నికల్లో మళ్లీ ప్రజల తిరుగుబాటు కనిపించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ప్రజలకు అసంతృప్తి ఉంది. దోపిడి పాలన మీద ప్రజలు తిరుగుబాటు చేశారు. తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తి లేదన్న వాళ్లకి నిన్నటి ఎన్నికలు ఒక కనువిప్పు కలిగిస్తాయి. ఈ సారి ప్రభుత్వాన్ని దించుతామని ప్రజలు నాతో అన్నారు. అధికార దుర్వినియోగానికి బీఆర్ఎస్ పాల్పడింది. తెలంగాణ వచ్చినప్పుడు కలిగిన సంతోషం మళ్లీ నిన్న ఎగ్జిట్ పోల్స్ విడుదలైనప్పుడు వచ్చిందని ప్రజలు భావిస్తున్నారు. చైతన్యంతో ప్రజల తీర్పును ఆహ్వానించి నాయకులు పార్టీలు మారకుండా ఉండాలి. లేకపోతే ప్రజలు ఇంటిముందు ధర్నాలు దిగే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను కేంద్రం పరిష్కరించాలి. తక్షణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదాలను సృష్టించవద్దు. పార్టీ కార్యకర్తలను సంతోష పరిచేందుకు కేటీఆర్ ప్రభుత్వ ఏర్పాటు అంటూ హడావుడి చేస్తున్నారు.’’ అని కోదండరాం తెలిపారు.