తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్ లో నడుస్తోందని.. అంటే ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రికి కేసీఆర్ ఫోబియా పట్టుకుందని విమర్శించారు. మైక్ పట్టుకోగానే కేసీఆర్ను తిట్టడం మించి మరో ఆలోచన రాదని రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ” ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలు, రైతుల కష్టాలు వదిలేసి ఎన్నికల ప్రచారానికి నిజామాబాద్ వెళ్లారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అందరూ 10 పర్సెంట్ సర్కార్ అని పిలుస్తున్నారు. పలాన చోట పర్సెంటేజీ ఇస్తే పని చేస్తున్నారని కొంత మంది చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన జరగడం లేదు. మహిళలకు రూ.2500 ఇవ్వలేదు కానీ ఇచ్చేశామని పక్క రాష్ట్రంలో ప్రకటనలు ఇస్తున్నారు. పీఆర్ స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజలకు పనిచేయడంలో లేదు. ఉచిత బస్సు ప్రయాణం మంచిదే కానీ మహిళల ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా చేయొద్దు. బస్సుల సంఖ్య పెంచాలి… అప్పుడే మహిళలతో పాటు అందరికీ సీట్లు దొరుకుతాయి. అటో డ్రైవర్లకు ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వాలి.
బీఆర్ఎస్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కేవలం రాజకీయం తప్పా పరిపాలనపై రేవంత్ సర్కారుకు దృష్టి లేదు. మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఏపీలో ఇదే పరిస్థితి ఏర్పడితే మద్ధతు ధర కోసం చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోయి లేదు.
ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ప్రజలకు ఏం చేశారని ప్రచారం చేయడానికి ?. రైతు రుణమాఫీ ఎవరికీ పూర్తిగా కాలేదు రైతు భరోసా గ్రామాల్లో చాలా మందికి రాలేదు. రుణ మాఫీ పేరిట రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. క్వింటాలు మిర్చికి రూ. 25 వేల మద్ధతు ధర కల్పించాలి.
వరదలు వచ్చినప్పుడు చేస్తామన్న సాయాన్ని ప్రభుత్వం చేయలేదు. వరద బాధితులకు ఇళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వలేదు.. వరదలొచ్చినా, కన్నీళ్లిచ్చినా, కష్టాలొచ్చినా అండగా ఉండేది గులాబీ జెండానే. కేసీఆర్ హయాంలో మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెందింది. కేసీఆర్ హయాంలో మంజూరైన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలి”… అని కవిత అన్నారు.