కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందర్శన | ఘటనలో ముగ్గురి మృతి
Deccan Nightwear Sports Complex Fire Incident in Secunderabad
ఉదయం 10 గంటలు అవుతోంది
సికింద్రాబాద్ లోని నల్లకుంట మినిస్టర్ రోడ్డు
ఎప్పటిలా వచ్చీ పోయే వాళ్లతో బిజీగా ఉంది.
అక్కడ స్పోర్ట్స్ స్టోర్ ప్రాంగణంలో…
డక్కన్ నైట్ వేర్ షాప్ నుంచి నెమ్మదిగా పొగ రావడం మొదలైంది.
క్షణాల్లో అది నల్లగా మారిపోయింది.
ఏం జరిగిందో ప్రజలకు అర్థమయ్యేసరికి, నల్లని పొగ చుట్టూ వ్యాపించింది.
క్షణంలో ఆ ప్రాంతమంతా అంధకారంగా మారిపోయింది.
ఆ రోడ్డు మీద, చుట్టుపక్కల 20 అడుగుల దూరం వరకు మధ్యలో ఉండిపోయిన ప్రజలకు ఏమీ కనిపించడం లేదు.
ఆ పొగలోంచే ధైర్యంగా ముందుకు వెళుతున్నారు.
ఒకవైపు కళ్ల మంటలు…ఎదురుగా వచ్చే వాహనాల మధ్యలో ప్రజలు హాహాకారాలు, భయంతో పరుగులు…
ఒక్కసారి భయానక వాతావరణం కనిపించింది.

అంతే వార్త దావానంలా వ్యాపించింది. స్పోర్ట్స్ స్టోర్ లో అగ్నిప్రమాదం సంభవించింది అనే విషయం తెలిసి అందరూ దూరంగా పారిపోయారు. విషయం తెలిసి ఆ రోడ్డు బ్లాక్ చేసేశారు. ఇంతలో పోలీసులు వచ్చారు. కాసేపటికి ఫైర్ ఇంజిన్లు వచ్చాయి. కానీ ఆ మంటలు నెమ్మది నెమ్మదిగా పెద్దవుతూ ఇంకా పెద్దవై పెరిగిపోతుంటే…మరో ఫైరింజన్ వచ్చింది. దాని తర్వాత మరొకటి, అలా 24 ఫైరింజన్లు వచ్చాయి. వాటి హారన్లు, గంటల మోతతో ఆ ప్రాంతమంతా హోరెక్కిపోయింది. నీరు అయిపోయిన ఫైరింజన్లు మళ్లీ రయ్ మంటూ వెళ్లడం, కొత్తవి రావడంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితులు ఏర్పడ్డాయి.
దురదృష్టం ఏమిటంటే 20 గంటలైనా ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఐదు అంతస్తుల డక్కన్ స్పోర్ట్స్ స్టోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో కార్ల షోరూమ్ ఉండగా, సెకండ్ ఫ్లోర్ లో బట్టల షోరూం ఉంది. ఆ బట్టలకు మంటలు అంటుకోవడంతో అవి ఒక్కసారిగా కాలిపోయి మంటలు మరింత చెలరేగాయని ఫైర్ మ్యాన్లు చెబుతున్నారు. అయితే ఐదంతుస్తులపై చిక్కుకున్న ముగ్గురిని భారీ క్రేన్ల సహాయంతో సురక్షితంగా ఫైర్ సిబ్బంది కిందకు దించగలిగారు. ముగ్గురు మాత్రం సజీవ దహనమయ్యారు. గుర్తుపట్టలేనంత విధంగా వారి శరీరాలు కాలి బూడిదయ్యాయి.
ఒక పోలీస్ కానిస్టేబుల్ కళ్లలో పొగ వెళ్లిపోవడంతో అతన్ని హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. పలువురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రులకి తరలించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులపై ఆరా తీశారు. తెలంగాణా రాష్ట్ర మంత్రులు కూడా వెళుతున్నారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం కేసీఆర్ కు చెబుతున్నారు.
దట్టమైన నల్లటి పొగ చుట్టూ వ్యాపించడంతో రక్షణ చర్యలకు విఘాతం ఏర్పడుతోందని అంటున్నారు. ఆ ఐదంతుస్తుల భవనం ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి, చుట్టుపక్కల భవనాల వారిని ముందు జాగ్రత్త చర్యగా బయటకు తీసుకువచ్చారు. అయితే అక్కడే స్థిర నివాసాలు ఏర్పరుచుకున్నవారంతా బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే కిలో మీటరు దూరం వరకు నివాస భవనాలు మసిబారిపోయాయని అంటున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.