Telangana: దేశంలోకరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి తోడు H3N2 ఫ్లూ జ్వరాలు కూడా పెరుగుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. తాజాగా తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. శనివాన్ ఒక్కరోజే రాష్ట్రంలో దాదాపు 28 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో పది కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 149 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఒకవైపు కరోనా కేసులు మరోవైపు వైరల్ ఫీవర్లు పెరగడం పట్ల వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
కరోనా టీకా వేసుకున్న, వేసుకోకపోయిన కరోనా ఎవరిని వదలడం లేదు. వ్యాక్సిన్ వేసుకుంటే కొంతవరకు రక్షణ ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనా కేసులు పెరిగినప్పటికీ ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని… దీనికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితమే వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు కరోనా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి మరిన్ని వ్యాక్సిన్ డోసులు కావాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ కి లేఖ రాశారు.