CM KCR| రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోనే గొర్రెల కొనుగోలు జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఆ ప్రకారమే గొర్రెల కొనుగోలు పంపిణీ వ్యవహారాలు సాగాలన్నారు. ఖాళీ ఇళ్ల స్థలాలు ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 3 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించే దిశగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించి, విధి విధానాలను రూపొందించి జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన నేపథ్యంలో…అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా వుందా అనే అంశానికి సంబంధించి, సిఎస్ శాంతి కుమారితో సీఎం కేసీఆర్ సమీక్షించారు. 4 లక్షల ఎకరాలకు సంబంధించి.. 1 లక్షా 55 వేల మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుక పాస్ బుక్కులు ముద్రించి సిద్దంగా వున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రకారం అన్ని అంశాలతో తాము సిద్దంగా వున్నామని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులకు పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం తెలిపారు.