బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ప్రజలకు చేరువయ్యేందుకు స్పీడ్ పెంచింది. గులాబీ బాస్ ప్రచారంలో కొత్త పంథా ఎంచుకున్నారు. రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని ఇప్పటికే ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఉదయం పొలంబాట, సాయంత్రం రోడ్ షోలలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు కేసీఆర్. అకాల వర్షాలకు నష్టపోయిన పంట లను పరిశీలించే పొలం బాటలో ఉదయం పాల్గొంటారు. రైతుల పొలాలకు వెళ్లి పంటలను పరిశీలిస్తారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారు కేసీఆర్. ఇక సాయంత్రం రోడ్ షోలకు ప్లాన్ చేస్తున్నారు గులాబీ నేతలు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22 నుంచి కేసీఆర్ రోడ్షోలు నిర్వహిస్తారు. ఇందుకోసం అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు.వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధిక సీట్లే లక్ష్యంగా ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో 2 లేదా 3చోట్ల రోడ్షోలు ఉంటాయి. అలాగే మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ పార్లమెంట్ స్థానాల్లో బహిరంగసభల్లో కేసీఆర్ పాల్గొంటారు.