ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నకలలు నిజమవుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి అక్కడ నుంచి ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని విజయవంతంగా నడిపించడమేకాదు, అటు రాష్ట్ర సాధన సాధించి, రెండుసార్లు అధికారాన్ని దక్కించుకుని ముందుకు వెళ్లిన ఆయన భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ పేరుని భారత రాష్ట్ర సమితిగా మార్చి దేశ రాజకీయాల్లోకి వెళ్లనున్నారు.
బీఆర్ఎస్ పేరును అధికారికంగా ఖరారు చేస్తూ కేసీఆర్ కి ఈసీ లేఖ అందడంతో తెలంగాణ టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. అందుకే భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాలను చేసేందుకు, నేటి నుంచే పని ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించారు.
అందుకు తగినట్టుగా తెలంగాణ భవన్ ముస్తాబవుతోంది. ఇక్కడే శృంగేరి శారదా పీఠం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటా 20 నిమిషాలకు ఈసీ పంపిన లేఖపై సీఎం కేసీఆర్ సంతకం చేయనున్నారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి అధికారికంగా కార్యక్రమాలు ప్రారంభిస్తారు.