చైనాలో న్యుమోనియా విజృంభిస్తోంది. శ్వాససంబంధమైన ఇబ్బందులు పడుతున్న పిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. స్కూళ్లలో టీచర్లు, ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సులతో పాటు సిబ్బంది అంతుచిక్కని ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. ఇది కొత్త రకమైన వైరస్ అని అంటున్నారు.
చైనా అనగానే గుర్తుకువచ్చేది కోవిడ్ -19. చైనా వూహాన్ లో మొదలైన కరోనా ప్రపంచమంతా వ్యాపించి … లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది. అలాంటి చైనాలో ప్రస్తుతం న్యుమోనియా విజృంభిస్తోంది. అంతే కాక పిల్లలు, శిశువులు శ్వాస సంబంధమైన వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫలితంగా పిల్లలు, తల్లిదండ్రులతో ఆస్పత్రులు కిటకిటలాడుతన్నాయి.
శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి కారణంగా ఆసుపత్రులు నిండిపోతున్నాయని, ఆసుపత్రి సిబ్బంది కూడా అస్వస్థతకు గురవుతున్నారని చైనా నుంచి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఇది మైకోప్లాస్మా న్యుమోనియా అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని చైనా అధికారులు చెబుతున్నారు. ఇది కొత్త రకం వైరస్ కావొచ్చని చైనాలోని ఇతర వర్గాలు చెబుతున్నాయి.
చైనాలో శీతాకాలంలో జలుబు, ఫ్లూ జ్వరాలు సర్వ సాధారణమే. నవంబర్ నెల వచ్చిందంటే.. ప్రతి ఒక్కరికీ ఫ్లూ, ఇన్ ఫ్లుయెంజా ఇన్జెక్షన్ వేస్తూ ఉంటారు. కానీ, న్యుమోనియా పెరగడం, శ్వాసకు ఇబ్బంది పడుతున్న పిల్లలతో ఆస్పత్రులు కిటకిటలాడడం ఆందోళన కల్గిస్తోంది. బీజింగ్, షాంఘైయ్ వంటి మహా నగరాలతో పాటు, ఇతర నగరాలలోనూ ఒకే రోజు వందల సంఖ్యలో జనం ఆస్పత్రుల్లో చికిత్స కోసం వస్తున్నారు.
కొద్దివారాలుగా చైనాలో న్యుమోనియాతో వేలాది మంది బాధపడుతున్నా.. ఎంతమంది చనిపోయారో అన్న లెక్కలను చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇది ప్రపంచాన్ని మరింత కలవరపరుస్తోంది. న్యుమోనియా మృతుల వివరాలు వెల్లడించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
చైనాలో శ్వాసకోశ వ్యాధుల కేసులు పెరగడానికి ఇన్ ఫ్లుయెంజా, మైకోప్లాస్మా న్యుమోనియా, సార్స్-కోవ్-2 వంటి సాధారణ కారకాలే కారణమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. చైనా గత డిసెంబర్లో కోవిడ్ ఆంక్షలను ఎత్తివేసింది. ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనా అధికారుల నుండి అదనపు సమాచారాన్ని కోరింది, ఈ కేసులు కొత్త వైరస్ వల్ల సంభవించాయని అనుమానించే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు అంటున్నారు.
చైనాలో న్యుమోనియా, శ్వాససంబంధమైన కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజారోగ్య సన్నద్ధతను వెంటనే సమీక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం హెల్త్ అడ్వైజరీ జారీ చేసింది. అత్యంత జాగ్రత్తగా శ్వాసకోశ వ్యాధులపై సన్నాహక చర్యలను సమీక్షించాలని నిర్ణయించినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.