మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీల మధ్య విజయవంతంగా సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మహా వికాస్ ఆఘాడీ కూటమి మధ్య అంగీకారం కుదిరింది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ సీట్లు ఉండగా ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలోని శివసేన 20 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు శరద్ పవార్ నాయకత్వం లోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పది స్థానాలకు పోటీ చేస్తాయి. స్వాభిమాని షెట్కారీ సంఘటన్ వంటి చిన్న పార్టీలకు ఆయా కూటమి భాగస్వామ్య పక్షాలు సీట్లు ఇవ్వనున్నట్లు మహావికాశ్ ఆఘాడీ వర్గాలు తెలిపాయి. ప్రకాశ్ అంబేడ్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ కలిసి వస్తే శివసేన, కాంగ్రెస్ కోటా నుంచి కనీసం మూడు సీట్లు దక్కవచ్చు. ఉద్ధవ్ థాక్రే , శరద్ పవార్ తోపాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే, పార్టీ సీనియర్ నేత బాలాసాహెబ్ థోరట్, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ చర్చల్లో పాల్గొన్నారు. సీట్ల పంపిణీపై ఒప్పందం కుదిరిందని, ఇక తదుపరి చర్చలు ఉండవని, ప్రచా రాన్ని ప్రారంభిస్తామని ఎన్సీపీ నేత జితేంద్ర అవద్ తెలిపారు.