తెలంగాణ రాజకీయం ఇప్పుడు కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్పుల తడక అని అటు బీఆర్ ఎస్, బీజేపీ నేతలు మాటలతో దాడి చేస్తున్నారు. ఇక జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఫుల్ యాక్టివ్ మోడ్ లోకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. అధికార పక్షాన్ని ఏ మాత్రం అవకాశం దొరికినా వదలడం లేదు. తాజాగా కేసీఆర్ పాలనను, రేవంత్ పాలనతో పోలుస్తూ విమర్శనాస్త్రాలు సంధించారు.
కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే… రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్ చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉందో.. కేసీఆర్ కు, రేవంత్ రెడ్డికి అంత తేడా ఉందట. చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది… కానీ సరిగ్గా పనిచేయదు. మాటలు చెప్పి బీసీల ఓట్లు వేయించుకొని బురిడీ కొట్టించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏ కులంలో ఎంత జనాభా ఉందో లెక్కలు ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారామె.
తూతూమంత్రంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీ సంఘాలతో సమావేశం పెట్టారని ఆరోపణలు చేశారు. స్వయంగా ముఖ్యమంత్రి ఎందుకు సమావేశమవ్వడం లేదని నిలదీశారు. బీసీ ఉద్యమం చేస్తున్న నాయకులతో ముఖ్యమంత్రి మాట్లాడకపోవడం బీసీలను అవమానించడమే కదా అని అన్నారు. బీసీ కుల సంఘాలతో ముఖ్యమంత్రి చర్చలు జరపాలని కవిత డిమాండ్ చేశారు.
42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు కల్వకుంట్ల కవిత. మరో తెలంగాణ పోరాటం తరహా పోరాటానికి బీసీలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. తప్పుడు జనాభా లెక్కలు చెప్పడంతో బీసీ సమాజం అట్టుడుకుతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే బీసీ కుల సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
52 శాతం బీసీలు ఉన్నారని 2014లోనే కేసీఆర్ లెక్క తేల్చారని కవిత చెప్పారు. కానీ లెక్కపెట్టడం కూడా రాని రేవంత్ రెడ్డి సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందన్నారు. బీసీల సంఖ్యను తక్కువ చూపించడం శోచనీయమన్నారామె. ఈ తప్పుడు లెక్కలు చెప్పి రాహుల్ గాంధీ పార్లమెంటును తప్పదోవపట్టించారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.
“420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది. ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారు. ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులకు నీళ్లు ఇచ్చే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి.
ఆడపిల్లలు స్కూటీలు, మహిళలకు రూ.2500 ఏమయ్యాయి…?. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది. రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. అర్హులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలి. రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదు ?. రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు. అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది”..అని కవిత అన్నారు.