ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా వివిధ శాఖలపై సమీక్షలు నిర్వహిస్తూ… కీలక ఆదేశాలు జారీ చేస్తూ వస్తున్నారు. ఇవాళ మరిన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం. గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ, ఆర్టీసీ రవాణా శాఖలపై సమీక్షించనున్నారు. మన్యంలో మెరుగైన వసతుల కల్పన, కొండలపై ఉండే గిరిజనులకున్న సౌకర్యాలపై చర్చించనున్నారు.. గిరిజన హాస్టళ్లల్లోని పరిస్థితులపై ఆరా తీయనున్నారు. గిరిజన ప్రాంతాల్లో గంజాయి సాగు చేయకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేయనున్నారు. అరకు కాఫీ బ్రాండ్ ప్రమోషన్, అరకు కాఫీ చైన్ షాప్స్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టిసారించారు ఏపీ సీఎం. ఈ సమావేశంలో ఆ దిశగా చర్చలు జరపనున్నారు.
మహిళలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేతపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. అంగన్వాడీ కేంద్రాల్లో మరింత మెరుగైన సదుపాయాల కల్పనపై సమీక్ష నిర్వహించనున్నారు. ఎస్సీ సంక్షేమంపై చంద్రబాబు కీలక సమీక్ష చేయనున్నారు.. ఎస్సీ వర్గాలకు అందచేయాల్సిన అంశంపై కసరత్తు జరగనుంది. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు అంశంపై కీలక ప్రస్తావన వచ్చే ఛాన్స్ ఉంది.