స్వతంత్ర వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అగ్ర నేత కేసీఆర్(KCR) ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన తరువాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పలువురు ఎమ్మెల్యేలకు సీట్లు దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇక తనకు సీటు వచ్చినా కూడా.. తన కుమారుడికి కూడా అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టి సంచలనంగా మారారు సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. మెదక్ నుంచి తన కుమారుడు రోహిత్కు(Rohith) టికెట్ కేటాయించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అయితే మైనంపల్లి(Mainampalli) త్వరలోనే బిజెపి కండువా కప్పుకోనున్నట్లు అర్థం అవుతుంది. ఇప్పటికే మైనంపల్లి అనుచరులు తన ఇంటి వద్ద భారత రాష్ట్ర సమితి పార్టీ ఫ్లెక్సీలను తొలగించారు. ఇక తాజాగా మైనంపల్లి హనుమంతరావు వికీపీడియా పేజీలో కూడా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నట్లు… అప్డేట్ చేశారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు బిజెపి పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టంగా అందరికీ క్లారిటీ వచ్చేసింది.
కాగా, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇటీవలే తన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు అందులో స్వల్ప మార్పులు చేసే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం అభ్యర్థిని మార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.