ఏపీ అసెంబ్లీ నుంచి వరుసగా రెండో రోజూ పలువురు టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. సభ ప్రారంభమైన వెంటనే రైతాంగ సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది. అయితే, ఈ తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. తామిచ్చిన తీర్మానంపై చర్చ చేపట్టాల్సిందేనంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఆక్వా రైతులను దోపిడీ చేసిన ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు… పోలవరం కట్టలేని అసమర్థ ప్రభుత్వం అని నినదించారు. పంట బీమా, ఇన్ పుట్ సబ్సిడీని మర్చిపోయిన ప్రభుత్వం అని నినాదాలు చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. స్పీకర్ వారిస్తున్నా టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. దీంతో టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు నందమూరి బాలకృష్ణ, బెందాళం అశోక్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయ స్వామిని స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. అయితే, సభ నుంచి వెళ్లేందుకు వారు నిరాకరించడంతో మార్షల్స్ రంగంలోకి దిగి.. టీడీపీ సభ్యులను బలవంతంగా బయటకు తీసుకెళ్లారు.