ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి( Y. S. Jagan Mohan Reddy) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని ఆరోపించిన జగన్… ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మండిపడ్డారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP) వృద్ధిరేటు 10.75 శాతంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు( N. Chandrababu Naidu) చెబుతున్నారని, అయితే ప్రభుత్వ ఆదాయం మాత్రం 3.22 శాతం తగ్గిందని జగన్ ప్రశ్నించారు. “రాష్ట్రం నిజంగా అభివృద్ధి చెందుతుంటే ప్రభుత్వ రెవెన్యూ పెరగాలి కదా?” అని నిలదీశారు.
2023-24లో పన్నుల ద్వారా రాష్ట్రానికి రూ.85,922 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తుచేసిన జగన్.. సాధారణంగా ప్రతి ఏడాది 8 శాతం వృద్ధి నమోదైతే 2025-26 నాటికి ఆ ఆదాయం రూ.1,00,219 కోట్లకు చేరుకోవాలని చెప్పారు. కానీ వాస్తవంగా మాత్రం ప్రభుత్వం రూ.86,552 కోట్ల ఆదాయం మాత్రమే సాధించిందని ఆరోపించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పే అభివృద్ధి గణాంకాలు, వాస్తవ పరిస్థితులకు పూర్తిగా విభిన్నంగా ఉన్నాయని విమర్శించారు.
ఇప్పటికే అప్పులు, ఆర్థిక లోటు, తగ్గుతున్న ఆదాయాలతో రాష్ట్ర పరిస్థితి దిగజారుతోందని వైసీపీ ఆరోపిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం పెట్టుబడులు, పరిశ్రమలు, అభివృద్ధి పనులతో రాష్ట్రం పురోగమిస్తోందని చెబుతోంది. దీంతో ఏపీ ఆర్థిక పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది.


