రాజస్థాన్ లోని (Rajasthan) జోధ్ పూర్( Jodhpur) గ్రామీణ ప్రాంతంలో ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపాయి. గ్యాంగ్రేప్, బ్లాక్మెయిల్ ఆరోపణలతో ఇప్పటికే మార్చిలో అక్క ఆత్మహత్య చేసుకోగా.. దాదాపు రెండు నెలల తర్వాత న్యాయం దొరకకపోవడంతో చెల్లెలు కూడా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనపై పోలీసుల నిర్లక్ష్యం, నిందితులను కాపాడే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బాధితుల తండ్రి పోలీసుల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిష్పాక్షిక దర్యాప్తు చేసి నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకోగా, మరికొందరిని విచారిస్తున్నారు.
అక్కను మహిపాల్ అనే ఈ-మిత్ర సేవా కేంద్ర నిర్వాహకుడు రహస్యంగా అసభ్య వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేశాడని, అతనితో పాటు మరో ఏడుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని చెల్లెలు ఏప్రిల్ 11న ఫిర్యాదులో పేర్కొంది. దాదాపు నాలుగేళ్ల పాటు బెదిరింపులు, డబ్బుల వసూళ్లతో ఆమెను వేధించారని తెలిపింది. ఈ వేధింపులు తట్టుకోలేక అక్క మార్చి 20న ఆత్మహత్య చేసుకుందని వెల్లడించింది.
తనకు న్యాయం జరగకపోతే తానూ ఆత్మహత్య చేసుకుంటానని చెల్లెలు పోలీసులను హెచ్చరించినప్పటికీ.. కేసు నమోదు చేసిన తర్వాత కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, అక్క మరణం తర్వాత నిందితులు తనను కూడా లైంగికంగా వేధించారని, వీడియోలు బయటపెడతామని బెదిరించారని ఆమె తెలిపింది.
శుక్రవారం నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ యువతి ఓ నీటి ట్యాంక్పైకి ఎక్కి నిరసన తెలిపింది. అనంతరం విషం తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి మార్చురీ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. మార్వార్ రాజ్పుత్ సంఘం అధ్యక్షుడు హనుమాన్ సింగ్ ఖాంగ్టా పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు. దర్యాప్తు మొత్తం సమయంలో నిందితులను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నించారని ఆరోపించారు.
జోధ్ పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీడీ నిత్య (PD Nitya) మాట్లాడుతూ… మహిపాల్తో పాటు మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అరెస్ట్ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. అలాగే సంబంధిత పోలీసు అధికారులపై శాఖాపరమైన విచారణ కూడా చేపడతామని హామీ ఇచ్చారు.


