హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేసును రీ ఓపెన్ చేస్తారా అంటే అవుననే అంటున్నారు తెలంగాణ డీజీపీ రవిగుప్తా . రోహిత్ తల్లి కొంతమందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని.. కేసు విచారణకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరతామని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను నమ్మొద్దన్న ఆయన.. రోహిత్ ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.
రోహిత్ వేముల..! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో PHD స్కాలర్. యూనివర్సిటీ క్యాంపస్ లో కుల వివక్ష దాడి భరించలేక 2016 జనవరి 17న న్యూ రీసెర్చ్ స్కాలర్ హాస్టల్ రూంలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని మరణించాడు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించింది. నాటి ఘటనలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావుపై కేసు నమోదైంది. యూనివర్సిటీ క్యాంపస్ లలో కుల వివక్ష కారణంగా ఒక్క రోహిత్ ఘటన మాత్రమే కాదు.. ఆ తర్వాతా ఇలాంటి సంఘటనలు జరగడం సంచలనం సృష్టించాయి. ఇలా ఒకటీ రెండూ కాదు.. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిని యూనివర్సిటీ వర్గాలు కొట్టి పారేస్తుండగా.. మృతుల స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రం కుల వివక్ష ఎదుర్కొన్నట్లు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా రోహిత్ వేముల కేసు విచారణ తెలంగాణ హైకోర్ట్ లో జరిగింది. అయితే.. రోహిత్ ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని నివేదిక సమర్పించారు పోలీసులు. ఇదే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలు, అందుకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని రిపోర్ట్ లో పేర్కొన్నారు ఖాకీలు. మరో కీలకమైన అంశం ఈ మొత్తం వ్యవహారంలో వీసీ అప్పారావుకు ఏ మాత్రం సంబంధం లేదని పోలీసులు తేల్చడం గమనార్హం. అదే సమయంలో అసలు రోహిత్ వేముల ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాదని తేల్చారు ఖాకీలు.
తాజాగా ఈ కేసు వ్యవహరం హైకోర్ట్ ముందుకు వచ్చిన నేపథ్యంలో.. నాడు రోహిత్ వేముల విషయంలో అసలు ఏం జరిగిందో ఓసారి గమనిస్తే.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ డీ చేస్తున్న విద్యార్థి రోహిత్ వేముల. అంబేడ్కర్ స్టూడెంట్ యూనియన్ అసోసియేన్ సభ్యుడు. అయితే.. ముంబై పేలుళ్ల కేసులో నిందితుడైన యాకూబ్ మెమెన్ ఉరిని నిరసిస్తూ హెచ్ సీయూలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ప్రార్థనలు నిర్వహించారు. దీనిపై ఏబీవీపీ నిరసన తెలిపింది. అనంతరం ఢిల్లీ యూనివర్శిటీలో ప్రదర్శించిన ముజఫర్ నగర్ బాకీహై అనే డాక్యుమెంటరీని హెచ్ సీయూలో ఏబీవీపీ ప్రదర్శించింది. దీనిపై ఏఎస్ ఏ నిరసన తెలిపింది. దీనిపై మొదలెన రగడ చినికి చినికి గాలివానగా మారింది. ఈ సమయంలోనే ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకుడు సుశీల్ కుమార్ పై దాడి జరిగడం మరింత ఉద్రిక్తతలకు దారి తీసింది. చివరకు రోహిత్ వేముల సహా ఐదుగురు విద్యార్థులపై ఆరునెలల పాటు బహిష్కరణ వేటు వేశారు. చివరకు హైకోర్ట్ జోక్యంతో శిక్షను తగ్గించారు. క్యాంపస్ లోనే ఉంటూ చదువుకున్నారు. ఈ సమయంలో వెలివాడ పేరుతో ఓ ప్రాంతం ఏర్పాటు చేసుకొని తమ నిరసన తెలిపారు. చివరకు జనవరి 17,2016న హాస్టల్ లోని రూంలో ఫ్యానుకు ఉరివేసుకొని చనిపోయాడు రోహిత్ వేముల. రోహిత్ మరణంతో దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాల యాల్లో ఆందోళనలు జరిగాయి. చివరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం స్వయంగా హెచ్ సీయూకి వచ్చి సంఘీభావం ప్రకటించారు. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఈ ఘటన విద్యార్థులు వర్సెస్ బీజేపీ అన్నట్లుగా మారిపో యింది. చివరకు ఇప్పుడు రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనకు సంబంధించిన కేసులో పోలీసులు సమర్పించిన నివేదిక చర్చనీయాంశంగా మారిందన్న వాదన బలంగా విన్పిస్తోంది.


