వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. రోజుకు మూడు నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలలో పాల్గొంటూ వైసీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. ప్రచార సభల్లో ప్రతిపక్ష పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే, ఐదేళ్ల కాలంలో వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను జగన్ ప్రజలకు వివరిస్తున్నారు. పేద ప్రజలకు మేలు జరగాలంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని, ప్రజలంతా వైసీపీకి మద్దతుగా నిలవాలని జగన్ కోరుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. హిందూపురం, చిత్తూరు లోక్ సభ పరిధిలోని పలమనేరు, నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీలలో జరిగే వైసీపీ సభల్లో జగన్ పాల్గోనున్నారు.
కాసేపట్లో శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణానికి సీఎం జగన్ చేరుకుంటారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. పుట్టపర్తి విమానా శ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో హిందూపురం చేరుకుంటారు. కాసేపట్లో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హిందూపురం హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో పలమనేరుకు జగన్ వెళ్తారు. చిత్తూరు లోక్ సభ నియోజక వర్గం పరిధిలోని పలమనేరులోని బస్టాండ్ సెంటర్ లో జరిగే వైసీపీ ఎన్నికల ప్రచార సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరి నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని నెల్లూరు సిటీకి చేరుకుంటారు. స్థానిక గాంధీ విగ్రహం సెంటర్ లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించే సభలకు వైసీపీ శ్రేణులు అన్నిఏర్పాట్లు చేశారు. జగన్ సభలకు భారీగా ప్రజలు హాజరవు తున్న క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక వైసీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు.