ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. ఆయన చెన్నైలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. స్క్రీన్ప్లే ల్యాబ్ గా, స్క్రీన్ ప్లే కింగ్ గా వెండి తెర ప్రముఖులచే కీర్తించబడిన భాగ్యరాజ్ ఆకస్మిక మృతి చలనచిత్ర రంగానికి తీరని లోటని ప్రముఖులు సంతాంపం వ్యక్తం చేశారు. భాగ్యరాజ్ 75 సినిమాల్లో నటించారు. 25 సినిమాలకు దర్శకత్వం వహించారు.
భాగ్యరాజ్ 1953 జనవరి 7న తమిళనాడులో జన్మించారు. కెరీర్ ప్రారంభంలో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశారు. ఆ తర్వాత కథారచయితగా, దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల జీవితం, వారి సమస్యలు, బంధాలు, భావోద్వేగాలను సహజంగా తెర పై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. స్క్రీన్ప్లే రచనలో ఆయనకు అసాధారణ పట్టు ఉండేది. కథను మలిచే తీరు, సన్నివేశాలను నిర్మించే విధానం కారణంగా ఆయనను సినీ పరిశ్రమ ప్రేమగా కింగ్ ఆఫ్ స్క్రీన్ప్లే అని పిలిచేది.
తమిళ్ లో ఆయన డైరెక్షన్లో డార్లిండ్ డార్లింగ్ డార్లింగ్ అనే సినిమాలో నటించానని.. భాగ్యరాజా మంచి రచయిత, నిర్మాత, దర్శకుడు.. వీటన్నింటి కంటే మంచి మనిషని.. సీనియర్ హీరో సుమన్ భాగ్యరాజాతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భాగ్యరాజా స్క్రీన్ ప్లేలో మెళుకువలు నేర్పించారని.. ఆయన లేకపోతే తను రచయితగా ఈ స్థాయిలో ఉండేవాడిని కాదన్నారు రైటర్ చిన్నికృష్ణ.
తెలుగు ప్రేక్షకులకు కూడా భాగ్యరాజ్ ఎంతో సుపరిచితం. ఇంటికొస్తే ఏమిస్తారు, మా ఇంటికొస్తే ఏం చేస్తారు, డిటెక్టివ్ నారద, అల్లంత దూరాన, ఒక చిన్న కథ కాదు, కుబేర చిత్రాల్లో ఆయన నటించి ప్రేక్షకులను అలరించారు. దర్శకుడిగా, రచయితగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా నాలుగు రంగాల్లోనూ తన ముద్ర వేసిన భాగ్యరాజ్ మరణం భారతీయ చిత్రసీమకు తీరని లోటు. ఆయన రూపొందించిన చిత్రాలు, ఆయన స్క్రీన్ప్లే శైలి, ఆయన సృజనాత్మకత ఎప్పటికీ సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.


