కేజీఎఫ్ మూవీతో.. పాన్ ఇండియా రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు యశ్. కేజీఎఫ్ తర్వాత యశ్ చాలా కథలు విని.. ఫైనల్ గా టాక్సిక్ స్టోరీకి ఓకే చెప్పడం.. అది కూడా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి ఓకే చెప్పడం విశేషం. అయితే.. ఈ మూవీ నుంచి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పటి నుంచి అడల్ట్ కంటెంట్ ఎక్కువుగా ఉందని విమర్శలు వచ్చాయి. యశ్ మాత్రం.. ఎవరు ఎలా కామెంట్స్ చేసినా.. స్టోరీ పై గట్టి నమ్మకంతో ఉన్నాడు. ట్రైలర్ రిలీజ్ చేసారు కానీ.. అసలు కథ ఏంటి అనేది సస్పెన్స్ గానే ఉంచారు. ఇంతకీ.. యశ్ నమ్మకం నిజమయ్యేనా..?
టాక్సిక్ నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కూడా ఆ అంచనాలను మరింతగా పెంచింది. సాధారణంగా ట్రైలర్ అంటే.. రెండు లేదా మూడు నిమిషాల నిడివితో ఉంటుంది కానీ.. టాక్సిక్ ట్రైలర్ దాదాపు నాలుగున్నర నిమిషాల పాటు ఉంది. ఈ ట్రైలర్లో టాక్సిక్ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేసారు. పాత్రలన్నింటినీ చూపించినప్పటికీ.. అసలు కథ ఏమిటన్న సస్పెన్స్ను మాత్రం అలాగే ఉంది.
ఒక చిన్న పిల్లాడు సారీ డాడీ… ప్రామిస్ అంటూ చెప్పే డైలాగ్తో టాక్సిక్ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి పూర్తిగా వైల్డ్ యాక్షన్ జోన్లోకి తీసుకెళ్తుంది. హాలీవుడ్ స్థాయి విజువలైజేషన్, భారీ యాక్షన్ బ్లాక్స్, బోల్డ్ క్యారెక్టర్స్తో అడుగడుగునా ఉత్కంఠను మరింత పెంచేసింది. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్ పాత్రలు కథలో కీలకంగా కనిపించాయి. ముఖ్యంగా కియారా అద్వానీ చెప్పే ముసుగేసుకుని ముఖం మీద ఉన్న దుఃఖాన్ని దాచిపెట్టొచ్చు… నుదుటిపై రాసిన విషాదాన్ని దాచలేము అనే డైలాగ్ ఈ కథకు ఒక ఆత్మను పరిచయం చేసినట్టుగా అనిపిస్తుంది.
అధికారాన్ని దక్కించుకోవడం కోసం జరిగే యుద్ధం.. వీటి మధ్యలోకి నయనతార పాత్ర ఎంట్రీ.. ఇలా ట్రైలర్లో కథకు సంబంధించిన ఎన్నో అంశాలను చూపించారు. యాక్షన్ మరింత వైల్డ్గా చూపించారు. చివర్లో వచ్చే రెండు పాత్రలతో ట్రైలర్ను ఒక పూర్తి సర్కిల్లోకి తీసుకురావడం ఆసక్తిని పెంచుతుంది. ఇందులో ప్రతి షాట్, యాక్షన్, క్యారెక్టర్ డిజైనింగ్ అన్నీ హాలీవుడ్ స్థాయిలో కనిపిస్తున్నాయి. దర్శకురాలు గీతు మోహన్దాస్ చాలా బోల్డ్, డార్క్ వరల్డ్ను ప్రేక్షకులకు చూపించబోతున్నారనే విషయం ట్రైలర్ను బట్టి తెలుస్తోంది.
అయితే.. టాక్సిక్ పై ఎన్ని విమర్శలు వచ్చినా.. యశ్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా రిలీజ్ తర్వాత అర్థం చేసుకుంటారని చెబుతున్నాడు. మరి.. యశ్ నమ్మకం నిజమౌతుందేమో లేదో తెలియాలంటే ఆగష్టు 26 వరుకు ఆగాల్సిందే.


